Telugu Global
Andhra Pradesh

పూర్తిగా ముసుగు తొలగించిన పీకే.. అసలు రూపం ఇదే

ఎల్లో మీడియాకే నేరుగా ఇంటర్వ్యూ ఇస్తే ఏపీలో ఎవరూ నమ్మరని భావించి.. హైదరాబాద్ లో ఇంగ్లిష్ మీడియా సంస్థ ఇంటర్వ్యూ అంటూ జగన్ పై విషం చిమ్మే పని మొదలు పెట్టారు.

పూర్తిగా ముసుగు తొలగించిన పీకే.. అసలు రూపం ఇదే
X

ఏపీలో సీఎం జగన్ ని టార్గెట్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ తో కలసి టీడీపీ ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తోందనే విషయం స్పష్టమైంది. ఆదివారం హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జగన్ ఓడిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని అప్పటికప్పుడు హైలైట్ చేశారు. ఓ పథకం ప్రకారం ఎల్లో మీడియా వార్తలు వండివార్చింది. పీకే అలా అన్నారా.. అని జనంలో చర్చ మొదలయ్యే టైమ్ కి పూర్తి ఇంటర్వ్యూ వచ్చేసిందంటూ ఎల్లో మీడియా మళ్లీ రచ్చ మొదలు పెట్టింది. ఇందులో పూర్తి స్థాయిలో ఏపీపై పీకే విషం చిమ్మారనే విషయం స్పష్టమైంది.

సంక్షేమ పథకాలను తాయిలాలని, వాటి వల్ల లాభం లేకపోగా జగన్ కి నష్టమే జరుగుతుందంటూ పీకే తనదైన శైలిలో విశ్లేషించడం ఇక్కడ విశేషం. మరి ఇవే తాయిలాలను మరింత ఎక్కువగా ఇస్తామంటూ ఎన్నికల వేళ హామీలిస్తున్న టీడీపీ-జనసేన కూటమిని జనం ఎలా నమ్ముతారో ఆయనే సెలవివ్వాలి. జగన్ పాలన పేద రాష్ట్రాలకు బ్రహ్మాండంగా సరిపోతుందని, కానీ ఏపీ ‘మిడిల్‌ ఇన్‌కం’ గ్రూప్ లోకి వస్తుందని, ఇలాంటి రాష్ట్రాల్లో ఆ ఫార్ములా పనిచేయదంటున్నారు పీకే. జగన్ వల్ల కేవలం 50శాంత మంది ప్రజలే లాభం పొందుతున్నారని అన్నారు పీకే. అందులో నిరుపేదలందరూ ఉన్నా కూడా ఆమేరకు వైసీపీ లాభపడినట్టే కదా..? ఈ లాజిక్ ని ఆయన గుర్తించలేదు.

చంద్రబాబుని కలిశా.. కానీ..!

చంద్రబాబుతో తనకు ఉన్న లాలూచీని కూడా పరోక్షంగా ఒప్పుకున్నారు పీకే. పశ్చిమ బెంగాల్ ఎన్నితల్లో తాను టీఎంసీ కోసం పని చేసినప్పుడు, చంద్రబాబును కలవాల్సిందిగా మమతా బెనర్జీ సూచించారని కానీ రెండేళ్లపాటు తాను బాబు దగ్గరకు వెళ్లలేదని చెప్పారు పీకే. కనీసం తాను జగన్ కోసం పనిచేయడం లేదనే విషయాన్ని అయినా చంద్రబాబుకి చెప్పాలని కొంతమంది ఒత్తిడి చేశారని, అందుకే తాను ఆయన్ను కలిశానని ఒప్పుకున్నారు.

రాష్ట్రంతో సంబంధం లేనప్పుడు..

గత ఎన్నికల తర్వాత తాను ఏపీకి ఒకటి రెండుసార్లు, అది కూడా తిరుమల శ్రీవారి దర్శనానికే వచ్చాని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ తరపున తానిప్పుడు పనిచేయడం లేదని కూడా అన్నారు. ఏపీకి రాకుండా, ఏపీ వ్యవహారాలు తెలియకుండా.. ఏపీ రాజకీయాలపై అంత నమ్మకంగా స్టేట్ మెంట్లివ్వడం ఆయనకే చెల్లింది. చంద్రబాబుతో లాలూచీ పడిన తర్వాత ఆయన పూర్తిగా చంద్రముఖిలా మారిపోయారనే విషయం అర్థమవుతోంది. హైదరాబాద్ లో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూ కూడా ఈ ప్యాకేజీలో భాగమేననే విషయం స్పష్టమైంది. ఎల్లో మీడియాకే నేరుగా ఇంటర్వ్యూ ఇస్తే ఏపీలో ఎవరూ నమ్మరని భావించి.. హైదరాబాద్ లో ఇంగ్లిష్ మీడియా సంస్థ ఇంటర్వ్యూ అంటూ జగన్ పై విషం చిమ్మే పని మొదలు పెట్టారు. చంద్రబాబు డైరక్షన్లో పీకే ఆడిన ఈ డ్రామాని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఎండగట్టడంతో సీన్ రివర్స్ అయింది. పీకే మంత్రాంగం బెడిసికొట్టింది.

First Published:  7 March 2024 3:17 AM GMT
Next Story