Telugu Global
Andhra Pradesh

నేడు తిరుపతికి పవన్.. బీసీల హెచ్చరికలతో టెన్షన్ టెన్షన్

ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. వాలంటీర్లు కోపంతో ఉన్నారు, జగ్గూ భాయ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు. కొత్తగా బీసీ నాయకులు అంజూ యాదవ్ కి సపోర్ట్ గా వస్తున్నారు.

నేడు తిరుపతికి పవన్.. బీసీల హెచ్చరికలతో టెన్షన్ టెన్షన్
X

సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తిరుపతి వస్తున్నారు పవన్ కల్యాణ్. అంజూ యాదవ్ జోలికొస్తే ఊరుకోబోమని పవన్ ని హెచ్చరించారు బీసీ, యాదవ సంఘాల నేతలు. ఈ నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరుగుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుపతిలో జనసేన నేతల బలప్రదర్శన ఎలాగూ ఉంటుంది. దాన్ని అడ్డుకోడానికి వైసీపీ మద్దతుతో కొంతమంది బీసీ నాయకులు హడావిడి చేసే అవకాశం కూడా ఉంది. నేరుగా వైసీపీ నేతలు తెరపైకి రావొచ్చు, వాలంటీర్లు కూడా ఆందోళనలకు సిద్ధపడొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పవన్ పర్యటన విషయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జనసేన నేతపై, సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతోపాటు.. ఆమె గత వీడియోలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఆమె వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు చార్జ్ మెమో ఇచ్చారు. అక్కడితో సరిపోదని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనసేన నాయకులు. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని మరింత హైలెట్ చేసేందుకు తిరుపతి వస్తున్నారు. నేరుగా జిల్లా ఎస్పీని కలిసి సీఐపై ఫిర్యాదు చేస్తానంటున్నారు. పవన్ రాకపై జనసేన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసింది. జనసైనికులంతా కదలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది పార్టీ.


టెన్షన్ టెన్షన్..

పవన్ తిరుపతి పర్యటన అంటే పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. వాలంటీర్లు కోపంతో ఉన్నారు, జగ్గూ భాయ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు. కొత్తగా బీసీ నాయకులు అంజూ యాదవ్ కి సపోర్ట్ గా వస్తున్నారు. అటు జనసైనికులు పవన్ పర్యటన విజయవంతం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు.

First Published:  17 July 2023 2:32 AM GMT
Next Story