Telugu Global
Andhra Pradesh

వైసీపీ రహిత గోదావరి.. పవన్ కొత్త ఫార్ములా

మనం పోటీ చేస్తామో లేదో తెలియదు కానీ, వారికి మాత్రం ఈ సీట్లు దక్కకూడదు అనే పట్టుదలతో ఉన్నారు పవన్ కల్యాణ్.

వైసీపీ రహిత గోదావరి.. పవన్ కొత్త ఫార్ములా
X

ఈసారి సరికొత్త వ్యూహాలతో వస్తా, వైసీపీకి వణుకు పుట్టిస్తానంటూ వారాహి యాత్ర చేపట్టిన పవన్ కల్యాణ్ కొత్త ఫార్ములా ప్రతిపాదించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకులతో సమావేశమైన ఆయన.. ఇక్కడినుంచి వైసీపీకి ఒక్క సీటు కూడా పోకూడదన్నారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలను చూడటమే జనసేన ప్రణాళికగా ఉండాలన్నారు. నా ప్రతినిధులుగా జనాల్లోకి వెళ్లండి, పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, బాధ్యతగల నాయకులుగా ఎదగండి అంటూ వారికి ఉద్బోధించారు.


గోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీకి రాదంటున్నారు సరే, మరి ఆ సీట్లన్నీ జనసేనకు దక్కేలా పవన్ ప్లాన్ గీస్తున్నారా అంటే అనుమానమే. మనం పోటీ చేస్తామో లేదో తెలియదు కానీ, వారికి మాత్రం ఈ సీట్లు దక్కకూడదు అనే పట్టుదలతో ఉన్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం గోదావరి జిల్లాలకే వారాహి యాత్ర పరిమితం చేసిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచే అత్యథిక సీట్లు అడిగి తీసుకుంటారేమో చూడాలి.

బరువైన గుండెతో నిద్రపోయేవాడ్ని..

కాకినాడలో జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించారు పవన్ కల్యాణ్. వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చే వారి నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి తానే స్వయంగా ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారు. గతంలో కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చినప్పుడు ఓపిగ్గా వాటిని వినేవాడినని, ఆబాధలు తలచుకుంటూ ఆరోజు బరువైన గుండెతో నిద్రపోయేవాడినని చెప్పారు పవన్. దివ్యాంగులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఇదే అసలైన క్లాస్ వార్ అని చెప్పారు. వివిధ కారణాలతో చనిపోయిన జనసైనికుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించారు.



First Published:  18 Jun 2023 1:49 AM GMT
Next Story