Telugu Global
Andhra Pradesh

పవన్‌కు నో ఎంట్రీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనబోయే బహిరంగసభ పూర్తిగా పార్టీపరమైనది కాబట్టి మిత్రపక్షానికి ఆహ్వానం పంపలేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. రమేష్ ప్రకటన వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది.

పవన్‌కు నో ఎంట్రీ
X

మిత్రపక్షం జనసేనకు బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. 11వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే బీజేపీ బహిరంగ సభకు మిత్రపక్షం అధినేత పవన్ కల్యాణ్‌కు నో ఎంట్రీ అని చెప్పేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనబోయే బహిరంగసభ పూర్తిగా పార్టీపరమైనది కాబట్టి మిత్రపక్షానికి ఆహ్వానం పంపలేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. రమేష్ ప్రకటన వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ బలమెంతో అందరికీ తెలుసు. బహిరంగసభకు జనసమీకరణ చేయాలంటే కమలనాథులు నానా అవస్థలు పడాలి. నరేంద్ర మోడీ సభకే రాని జనాలు ఇక అమిత్ షా సభకు ఏమొస్తారు ? అమిత్ షా పాల్గొనబోయే బహిరంగసభ సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా జనసేన అధినేత పవన్‌ను పిలవాల్సిందే. ఎందుకంటే పవన్ బహిరంగసభలో పాల్గొంటున్నారంటే అభిమానులు పోటెత్తుతారు. ఆ రకంగా అయినా బీజేపీ బహిరంగసభలో జనాలు నిండుగా కనబడతారు. ఉత్తరాంధ్రలో పవన్‌కు అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు.

ఇంతచిన్న విషయం బీజేపీ నేతలకు తెలియ‌కుండా ఉంటుందా? అయినా ఎందుకని పవన్‌ను బహిరంగసభకు దూరంగా ఉంచుతున్నారో అర్థ‌కావటంలేదు. బహిరంగసభకు ఆహ్వానిస్తే పవన్ కూడా తప్పకుండా హాజరవుతారు. ఎందుకంటే గడచిన నాలుగేళ్ళుగా మోడీ, అమిత్ షాతో మాట్లాడేందుకు అపాయిట్మెంట్ కోసం పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. బహిరంగసభ పుణ్యమా అని అయినా అమిత్ షాతో మాట్లాడే అవకాశం వస్తుందంటే పవన్ ఎందుకు వదులుకుంటారు.

బీజేపీతో టీడీపీ పొత్తు కుదర్చాలని పవన్ తెగ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి విశాఖ పర్యటనకు పవన్‌ను కూడా పిలిచి ఉంటే ఆ విషయం అమిత్ షాతో మాట్లాడే అవకాశం దొరికుండేది. అలాంటిది పవన్‌ను పిలవకపోతే పోయారు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. మొత్తానికి తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు ఏదో వ్యూహం రచించే ఉంటారని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పవన్‌ను దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. మరా వ్యూహం ఏమిటి? అనేది బహుశా బహిరంగసభ తర్వాత బయటపడుతుందేమో చూడాలి.

First Published:  10 Jun 2023 5:46 AM GMT
Next Story