Telugu Global
Andhra Pradesh

అంబటి నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావా..? - వైసీపీ ఎంపీటీసీ ఫైర్

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన భర్త 40 లక్షలు ఖర్చు చేశారని.. ఒక కారును కొని అంబటి రాంబాబు కోసం రోజూ తిప్పారని కోటిరెడ్డి భార్య విజయలక్ష్మి చెప్పారు.

అంబటి నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావా..? - వైసీపీ ఎంపీటీసీ ఫైర్
X

సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్దమక్కిన గ్రామ ఎంపీటీసీ విజయలక్ష్మి, ఆమె భర్త కోటిరెడ్డిలు మంత్రి అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు. సర్వనాశనం అయిపోయామంటూ మంత్రి అంబటిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసారి ఓట్లు అడిగేందుకు వస్తే ఈ నాకొడుకులను తానే చెప్పుతో కొడుతానని విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. మంత్రి అంబటి రాంబాబు కడుపుకు అన్నమే తింటున్నారా లేక గడ్డిఏమైనా తింటున్నారా అని ఆమె ప్రశ్నించారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు తమకు ఫోన్ చేసి 20 ఆటోలు, 30 ఆటోల్లో మనుషులను పంపండి అనేవాడని విజయలక్ష్మి భర్త కోటిరెడ్డి వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటిరెడ్డి కావాలి.. ఇప్పుడు మాత్రం ఈ నాకొడుకులకు మేం కళ్లకే కనిపించడం లేదా..? అని కోటిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నాకొడుకుల కోసం 40 లక్షలు ఖర్చు పెట్టానని.. ఇప్పుడు బిడ్డను చదివించుకునేందుకు కూడా డబ్బులు లేకుండాపోయాయని కోటిరెడ్డి చెబుతున్నారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన భర్త 40 లక్షలు ఖర్చు చేశారని.. ఒక కారును కొని అంబటి రాంబాబు కోసం రోజూ తిప్పారని కోటిరెడ్డి భార్య విజయలక్ష్మి చెప్పారు. ప్రస్తుతం తన మెడలో తాళిబొట్టు కూడా లేకుండాపోయిందని ఆమె ఆవేదన చెందారు. గతంలో తన భర్త చేతికి నాలుగు ఉంగరాలు ఉండేవని, ఇప్పుడు వాటిని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందన్నారు. తన బిడ్డను చదివించేందుకూ డబ్బులు లేని స్థితికి వచ్చేశామన్నారు. ఇదే చేతులతో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాళ్లు వస్తే రోజూ భోజనాలు వండిపెట్టానని.. ఇప్పుడు ఆ విషయాలు కూడా అంబటి రాంబాబుకు గుర్తులేవా ?.. అతడు కడుపుకు అన్నం తినడం లేదా అని విజయలక్ష్మి ప్రశ్నించారు.

తమ ఇంటి తలుపుల మీద కూడా వైఎస్‌ఆర్‌ బొమ్మ ఉందని.. అలాంటి తమనే ఇలా నాశనం చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఆర్థికంగా ఎలాగో నష్టపోయామని, చివరకు గ్రామంలో జరిగే కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదని, పైగా వేరే వ్యక్తులకు గ్రామంలో పెత్తనాన్ని అంబటి రాంబాబు కట్టబెడుతున్నారని.. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలోకి మరో ఎమ్మెల్యే వచ్చి పెత్తనం చేస్తే ఊరుకుంటారా అని ఎంపీటీసీ ప్రశ్నించారు. రిపబ్లిక్ డే రోజు గ్రామ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఎంపీటీసీ దంపతులు ఇలా ఓపెన్ అయ్యారు.

First Published:  27 Jan 2023 3:52 PM GMT
Next Story