Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కోరిక తీరటం లేదా?

ఎఫ్ఆర్బీఎం పరిమితిని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి మండిపోవాలని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఆశిస్తోంది. అయితే వీళ్ళ ఆలోచనలకు తగ్గట్లుగా కేంద్ర మంత్రి సమాధానాలు చెప్పటంలేదు.

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కోరిక తీరటం లేదా?
X

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దేనికంటే ఏదో విధంగా రాష్ట్రం అప్పుల పాలైపోయిందని కేంద్ర ప్రభుత్వంతో చెప్పించేందుకు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి పదేపదే ఏదో రూపంలో ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అయినా ఆర్థికశాఖ మంత్రులు మాత్రం ఒకటే వివరాలను తిప్పి తిప్పి చెబుతున్నారు. ఏపీ అప్పులపై టీడీపీ ఎంపీలు అడిగారు. తర్వాత బీజేపీ ఎంపీ అడిగారు. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ అడిగారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రశ్నలు వేసినా ఆర్థికమంత్రి జవాబు మాత్రం ఒకటిగానే ఉంటోంది.

దీన్నే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతున్నాయి. 2023, మార్చి వరకు ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లని ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో రూ.2.74 లక్షల కోట్ల అప్పుంటే 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1.78 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రకటించారు. అప్పులపై కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాకు ఏమాత్రం సహిచటంలేదు.

వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏపీ అప్పులు రూ. 10 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్రం చెప్పాలని. జగన్ హయాంలో అప్పులు చేయటంలో క్రమశిక్షణ లోపించటం వల్ల రాష్ట్రం అప్పులపాలైపోతోందని కేంద్రం ఆక్షేపించాలని కోరుకుంటున్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని కేంద్రమంత్రి మండిపోవాలని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఆశిస్తోంది. అయితే వీళ్ళ ఆలోచనలకు తగ్గట్లుగా కేంద్ర మంత్రి సమాధానాలు చెప్పటంలేదు. అందుకనే కేంద్ర మంత్రి కూడా ఏపీ అప్పులను దాచేస్తోందని ఎల్లో మీడియా గోల మొదలుపెట్టింది.

కార్పొరేషన్ అప్పులను పట్టించుకోవటంలేదని, రాష్ట్రం ఏవైతే లెక్కలు ఇస్తోందో దాన్నే కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటిస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. నిజానికి చంద్రబాబునాయుడు హయాంలో కూడా విపరీతమైన అప్పులు చేశారు. అప్పుడూ కార్పొరేషన్ అప్పులను లెక్కల్లో చూపలేదు. ఏడాది పొడవునా రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లను వేలం వేయించుకుని అప్పులు సమీకరించారు. కార్పొరేషన్లను కుదవపెట్టేసి అప్పులు తెచ్చారు. అప్పట్లో ఇదే ఎల్లో మీడియా కళ్ళుమూసుకుని కూర్చుని ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. జగన్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందని నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రకటించటాన్నే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది.

First Published:  1 Aug 2023 5:41 AM GMT
Next Story