Telugu Global
Andhra Pradesh

దక్షిణాది నితీశ్‌కుమార్‌ చంద్రబాబు

ఉత్తరాదిన నితీశ్‌ కుమార్‌ సైతం యూ టర్న్‌లకు మారుపేరుగా మారిపోయారు. సిద్ధాంతాలు లేకుండా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడంలో దిట్టగా పేరు పొందారు.

దక్షిణాది నితీశ్‌కుమార్‌ చంద్రబాబు
X

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఇప్పటికే హస్తినకు చేరుకున్న చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. దీంతో చంద్రబాబుపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చంద్రబాబు దక్షిణాది నితీశ్‌ కుమార్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పాలిటిక్స్‌లో యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటూ మండిప‌డుతున్నారు.

ఉత్తరాదిన నితీశ్‌ కుమార్‌ సైతం యూ టర్న్‌లకు మారుపేరుగా మారిపోయారు. సిద్ధాంతాలు లేకుండా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడంలో దిట్టగా పేరు పొందారు. ఇక దక్షిణాదిన అలాంటి నేత ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఫస్ట్ కనిపించేది చంద్రబాబే. మొదట్లో ఎన్డీఏ కూటమిలో కొనసాగిన చంద్రబాబు.. 2004లో ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. 2014లో మళ్లీ ఎన్డీఏలో చేరారు. నాలుగున్న‌రేళ్లు బీజేపీతో అనుబంధాన్ని కొన‌సాగించారు. ఆ త‌రువాత 2019కి ముందు మోడీ, అమిత్ షాలను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని చెప్పుకుంటారు. కానీ, టీడీపీ మూలాల‌ను, సిద్ధాంతాలు మరిచి అలాంటి కాంగ్రెస్‌తోనే అంటకాగిన చరిత్ర చంద్రబాబుది. కలిసి పోటీ చేయనప్పటికీ 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు చంద్రబాబు. రాహుల్‌ గాంధీ కాబోయే ప్రధాని అంటూ భుజాలకెత్తుకున్నారు. కానీ, విధి ఎదురుతన్నింది. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న చంద్ర‌బాబు.. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ బ‌లం స‌రిపోద‌ని భావించి ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు కమలనాథుల కాళ్లా,వేళ్లా బతిమాలుడుతున్నారు. మరీ కాషాయ పార్టీ కనికరిస్తుందా..లేదా చూడాలి.

First Published:  7 Feb 2024 1:47 PM GMT
Next Story