Telugu Global
Andhra Pradesh

వివేకా రెండో పెళ్లిపై నాలుక మడతపెట్టిన సునీత

తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తెలియదని సునీత బుకాయించడం వెనక అసలు రహస్యమేమిటనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

వివేకా రెండో పెళ్లిపై నాలుక మడతపెట్టిన సునీత
X

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత కేవలం ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో పాలు పంచుకుంటున్నారు. అందుకు తన తండ్రి వైఎస్ వివేకా హత్యను వాడుకుంటున్నారు. సునీత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పెయిడ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలియదని ఆమె బుకాయించారు. లోకానికంతా ఆ విషయం తెలుసు. వివేకానంద కూడా ఈ విషయంలో గోప్యత ఏమీ పాటించలేదు. వివేకానంద రెడ్డి షమీమ్ అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు గతంలో విడుదల కాగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివేకానంద రెడ్డి, భార్య షమీమ్, కుమారుడు కలిసి ఆనందంగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ పరిస్థితిలో కూడా తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తెలియదని సునీత బుకాయించడం వెనక అసలు రహస్యమేమిటనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో సునీత ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయట కదా..’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ఆమె తన రెండు భుజాలు ఎగిరేస్తూ ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు) అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వివేకానందరెడ్డి ముస్లిం సంప్రదాయం ప్రకారం 2010లో షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి 2014లో ఓ కుమారుడు జన్మించాడు. అతనికి షెహన్ షా అనే పేరు పెట్టారు. వివేకానందరెడ్డి రెండో వివాహం వల్లనే కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయనేది స్పష్టం. తన రెండో భార్య షమీమ్ కు ఆస్తిలో వాటా ఇస్తానని, తన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకానంద రెడ్డి చెప్పారు. దీంతో వివేకానంద రెడ్డి అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తి తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం కూడా తనకే దక్కాలని పట్టుబట్టారు.

ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల వదిలేసి హైదరాబాదులో కూతురు సునీత నివాసంలో ఉంటూ వచ్చారు. షమీమ్ ను తిడుతూ వాట్సప్ మెసేజ్ లు పంపారు. షమీమ్ ఈ విషయాలను వివేకానందరెడ్డికి చెప్పారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పారు. వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి షమీమ్ బావను బెదిరించాడు. దాంతో ఆ కుటుంబం పులివెందుల వదిలి వెళ్లిపోయింది.

వివేకా చెక్ పవర్ తీసేసిన విషయం, ఆయనను ఒంటరి చేసిన విషయం, వివేకా నాలుగు ఎకరాల భూమిని శివప్రకాష్ రెడ్డి తన పేర రాయించుకోవడం, చెక్ పవర్ తీసేయడంతో అప్పులను తీర్చడానికి హైదరాబాదులోని మణికొండలో ఉన్న తన ఇంటిని వివేకా 2018లో విక్రయించడం వంటి అనేక పరిణామాలు ప్రజలందరికీ తెలిసినవే. ఈ పరిస్థితిలో తనకు వివేకానంద రెండో పెళ్లి విషయం తెలియదని సునీత అనడంలోని ఆంతర్యం స్పష్టంగా అర్థమయ్యేదే. తమ కుటుంబంలోని తగాదాలు బయటకు రాకుండా, ఆ కోణంలో దర్యాప్తు జరగకుండా చూడడం కోసమే ఆమె అబద్ధాలు ఆడుతున్నారనేది స్ఫష్టం.

First Published:  18 April 2024 4:01 AM GMT
Next Story