Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణిపై ప్రశ్నకి నీళ్లు నమిలిన లోకేష్.. అదేం ప్రశ్న స్వామీ?

వాస్తవానికి నారా లోకేష్ ఇలాంటి ప్రశ్నని ఊహించలేదు. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరి చూపు నారా లోకేష్ వైపు వెళ్లింది.

బ్రాహ్మణిపై ప్రశ్నకి నీళ్లు నమిలిన లోకేష్.. అదేం ప్రశ్న స్వామీ?
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుని ఫ్యామిలీతో వెళ్లి ములాఖత్‌లో కలిసిన నారా లోకేష్‌.. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ఓ వింత ప్రశ్న అతనికి ఎదురైంది. దాంతో అదేం ప్రశ్న స్వామీ..? అంటూ రిపోర్టర్‌పై మండిపడిన నారా లోకేష్ సమాధానం చెప్పకుండా దాట‌వేశాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. టీడీపీలో బ్రాహ్మణి పాత్ర ఏంటి సార్..?

వాస్తవానికి నారా లోకేష్ ఇలాంటి ప్రశ్నని ఊహించలేదు. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరి చూపు నారా లోకేష్ వైపు వెళ్లింది. కానీ.. బాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయిన నారా లోకేష్ అక్కడ దాదాపు 22 రోజుల పాటు ఉండిపోయారు. దాంతో అతని భార్య నారా బ్రాహ్మణి అన్నీ తానై తన అత్త భువనేశ్వరితో కలిసి ఏపీలో దీక్ష, నిరసన, ఆందోళ‌న‌ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ఒక్కసారిగా టీడీపీలో హైలైట్ అయ్యింది. ఈ కారణంగానే నారా లోకేష్‌కి ఆ ప్రశ్న ఎదురైంది.

నీళ్లు నమిలి.. సమాధానం దాటవేత

టీడీపీలో బ్రాహ్మణి పాత్ర గురించి ప్రశ్న రాగానే నారా లోకేష్ తొలుత ఆశ్చర్యంగా రిపోర్ట్ వైపు చూశారు. అనంతరం అదేం ప్రశ్న స్వామి..? అని సమాధానం దాటవేస్తూ తన తల్లి భువనేశ్వరి గురించి చెప్పుకుంటూ వెళ్లారు. అయితే 22 రోజులు ఏపీలో లేని లోకేష్‌కి బ్రాహ్మణికి పెరిగిన‌ క్రేజ్ సరిగా తెలిసినట్లు లేదు. ఈ మూడు వారాలుగా బాబుతో ఏ టీడీపీ నాయకుడు ములాఖత్‌కి వెళ్లినా.. వారి వెంట నోట్‌బుక్‌తో బ్రాహ్మణి ఉంటుంది. పార్టీ వ్యవహారాల్ని బాబుకి చేరవేస్తూ.. అతను చేసే సూచనలను కేడర్‌కి ఆమె వివరిస్తోందని టాక్ బలంగా నడుస్తోంది.

లోకేష్ అరెస్ట్ అయితే.. బ్రాహ్మణి పాదయాత్ర

అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఏ14‌గా ఉన్న నారా లోకేష్‌కి ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణ తర్వాత లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకవేళ అవసరమైతే నారా బ్రాహ్మణి పాదయాత్ర చేస్తుందని టీడీపీ సీనియర్ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. దాంతో బాబు తర్వాత బ్రాహ్మణినే అనే స్థాయికి టీడీపీ కేడర్‌కి సంకేతాలు వెళ్లిపోయాయి.

బాలయ్య సైలెంట్..

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎక్కువ హడావుడి చేసిన వ్యక్తుల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. టీడీపీ కార్యాల‌యంలో చంద్ర‌బాబు రెగ్యులర్‌గా కూర్చునే సీటులో కూర్చుని సీనియర్ నాయకులతో చర్చించి.. నేను వస్తున్నా అంటూ కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలోనూ ఓ రెండు రోజులు హడావుడి చేశారు. దాంతో టీడీపీ మళ్లీ నందమూరి చేతుల్లోకి వెళ్లబోతోందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు హైదరాబాద్‌కే ఆయన పరిమితమైపోయారు.

First Published:  7 Oct 2023 3:11 AM GMT
Next Story