Telugu Global
Andhra Pradesh

దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు.. ఉండవల్లిని వాడుకున్న నారా లోకేష్

వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ వీడియోని వాడుకున్నారు. వెన్నుపోటు అంటే అది కాదని, ఇది అని అన్నారు లోకేష్.

దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు.. ఉండవల్లిని వాడుకున్న నారా లోకేష్
X

ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పు వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరిగి చివరకు వెన్నుపోటు వరకు వచ్చి ఆగింది. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వారికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీకి డైలాగ్ లు లేకుండా పోయాయి. కానీ నారా లోకేష్ మాత్రం తనవంతు ప్రయత్నం చేశారు. వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ వీడియోని వాడుకున్నారు. వెన్నుపోటు అంటే అది కాదని, ఇది అని అన్నారు లోకేష్.

ట్విట్టర్లో కాస్త ఘాటుగానే స్పందించారు నారా లోకేష్. 'పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే.' అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ పార్ట్ ని తన ట్వీట్ కి జత చేశారు.

వైఎస్ఆర్ మంత్రిమండలి చేసిన తప్పుకి తనని బలిచేస్తున్నారేంటని అప్పట్లో జగన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, అందువల్లే వైఎస్ఆర్, ఆయన మంత్రివర్గంలో పనిచేసినవారు, అప్పటి సీనియర్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారని చెప్పారు. అంటే వైఎస్సార్ ని కూడా ముద్దాయి చేసింది పరోక్షంగా జగనే అన్నట్టుగా ఉండవల్లి మాట్లాడారు.

సహజంగా ఉండవల్లి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకే ఆయన ఇంటర్వ్యూలను కానీ, ప్రెస్ మీట్లను కానీ టీడీపీ అనుకూల మీడియా అస్సలు పట్టించుకోదు. అలాంటి ఉండవల్లి చెప్పిన మాటల్ని ఇప్పుడు నారా లోకేష్ కోట్ చేయడమే విశేషం. అప్పట్లో రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు వ్యవహారంలో బాగా హైలెట్ అయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన టీడీపీకి కూడా శత్రువుగానే ఉన్నారు. ఇప్పుడు లోకేష్, జగన్ ని టార్గెట్ చేయడానికి అరుణ్ కుమార్ వీడియో ఉపయోగించుకోవడం విశేషం.

First Published:  26 Sep 2022 9:44 AM GMT
Next Story