Telugu Global
Andhra Pradesh

3 నెలల ముచ్చట.. సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు

ప్రజా రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ కట్టింది టీడీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు లోకేష్. అక్కడ కూర్చుని జగన్ ఇదేం రాజధాని అంటున్నారని, విశాఖ ను రాజధాని చేస్తానన్నారని, కోర్టుల‌ ఆదేశాలున్నా వ్య‌వ‌స్థ‌ల్ని బెదిరించి దొడ్డిదారిన ప్ర‌భుత్వ కార్యాల‌యాల్ని త‌ర‌లించేందుకు జీవోలిప్పించారని మండిపడ్డారు లోకేష్.

3 నెలల ముచ్చట.. సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు
X

సీఎం జగన్ పాలనకు ఎక్స్ పయిరీ డేట్ దగ్గరపడిందని, కేవలం 3 నెలలే ఆయనకు సమయం ఉందని సెటైర్లు పేల్చారు నారా లోకేష్. మూడు నెలల నీ ముచ్చట కోసం ప్రజల సొమ్ము వేల కోట్లు తగలేస్తున్నావేంటి అని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల కోసం భవనాలను కేటాయిస్తూ జీవో విడుదల చేయడంపై లోకేష్ ఇలా స్పందించారు.


ప్రజారాజధాని అమరావతిలో సెక్రటేరియట్ కట్టింది టీడీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు లోకేష్. అక్కడ కూర్చుని జగన్ ఇదేం రాజధాని అంటున్నారని, విశాఖ ను రాజధాని చేస్తానన్నారని, కోర్టుల‌ ఆదేశాలున్నా వ్య‌వ‌స్థ‌ల్ని బెదిరించి దొడ్డిదారిన ప్ర‌భుత్వ కార్యాల‌యాల్ని త‌ర‌లించేందుకు జీవోలిప్పించారని మండిపడ్డారు లోకేష్.

ఐటీని నాశనం చేస్తున్నారు..

విశాఖలో ఐటీ డెవ‌ల‌ప్మెంట్ కోసం టీడీపీ ప్రభుత్వం మిలీనియం ట‌వ‌ర్స్‌ ని కట్టిస్తే.. వాటిని జగన్ ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు లోకేష్. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీల‌ని ప‌క్క‌రాష్ట్రాల‌కి త‌రిమేస్తున్నారని చెప్పారు. వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని, రుషికొండ‌ని ధ్వంసం చేశారని, కైలాస‌గిరిని నాశనం చేశారని, విశాఖ‌ని విధ్వంసం చేసి ఆ శిథిలాల‌పై కూర్చుని ఏం చేస్తావు జగన్.. అని ప్రశ్నించారు లోకేష్.

విశాఖ రాజధాని విషయంలో పడుతున్న ప్రతి అడుగుని అడ్డుకోవాలని చూస్తోంది టీడీపీ. ఆ మధ్య అమరావతి రైతులతో రాద్ధాంతం చేయించి కోర్టులో కేసులు వేయించింది. కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఉత్తరాంధ్ర సమీక్షలు అనే కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చింది. ఆ సమీక్షల కోసం మంత్రులు, అధికార యంత్రాంగం వెళ్తే అప్పుడు అవసరం కోసం అంటూ ఆఫీసులు వెదికి పెట్టింది, జీవోలిచ్చింది. దీనిపై కోర్టుల్లో కేసులు వేసే అవకాశం లేకపోవడంతో ఇలా తన ఆగ్రహాన్ని బయటపెట్టారు నారా లోకేష్.

First Published:  24 Nov 2023 7:41 AM GMT
Next Story