Telugu Global
Andhra Pradesh

చిత్తూరు ఎస్పీకి ఆపరేషన్ చేయిస్తా.. లోకేష్ సెటైర్లు

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని ధ్వజమెత్తారు లోకేష్. వైసీపీ నేతలు చేస్తున్న దాడులు ఎస్పీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

చిత్తూరు ఎస్పీకి ఆపరేషన్ చేయిస్తా.. లోకేష్ సెటైర్లు
X

పుంగనూరు అల్లర్ల తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అల్లర్లకు కారణమైన టీడీపీ నేతలు, కార్యకర్తల్ని వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారాయన. గొడవలకు కారణం టీడీపీ నేతలేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఆయన టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. వైసీపీకి వంతపాడుతున్నారంటూ టీడీపీ ఆయనపై ఆరోపణలు చేస్తోంది. తాజాగా నారా లోకేష్ కూడా రిషాంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, ఆయనకు ఆపరేషన్ చేయిస్తానన్నారు.

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని ధ్వజమెత్తారు లోకేష్. వైసీపీ నేతలు చేస్తున్న దాడులు ఎస్పీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తామన్నారు. ఏపీలో కొంతమంది పోలీసులు వైసీపీ నాయకులు చెప్పినట్టల్లా ఆడుతున్నారని, డిపార్ట్ మెంట్ పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.


టచ్ చేస్తే.. షాకే..!

చంద్రబాబు హై వోల్టేజ్.. ముట్టుకుంటే షాక్ తప్పదని అన్నారు లోకేష్. అధికార పక్షం నేతలే జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చే వింత పరిస్థితి ఏపీలో తప్ప ఇంకెక్కడా లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని సీఎం, చంద్రబాబుపై రాళ్ల దాడి చేయిస్తున్నారనని మండిపడ్డారు. లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల విలువైన వాటర్ బాటిల్‌ నీరు తాగే జగన్, తాను పేదవాడినని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు లోకేష్. నాలుగు చోట్ల రాజ భవనాలు ఉన్న జగన్.. పేదవారా..? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచారని చెప్పారు ప్రతి చోటా తన ఫొటో వేసుకునే జగన్... కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లుపై ఎందుకు వేసుకోరని అన్నారు లోకేష్.

First Published:  7 Aug 2023 4:42 PM GMT
Next Story