Telugu Global
Andhra Pradesh

లోకేష్ యాత్ర పరమావధి అదే.. కొడాలి మార్కు లాజిక్

ఇప్పటి వరకు ఏపీలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి యాత్రలు చేశారని.. ఏ అర్హతతో లోకేష్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు కొడాలి నాని.

లోకేష్ యాత్ర పరమావధి అదే.. కొడాలి మార్కు లాజిక్
X

నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ నుంచి రకరకాల కౌంటర్లు పడుతున్నాయి. లోకేష్ యాత్రతో వైసీపీకే లాభం అని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు, లోకేష్ యాత్రలు చేసినా నాయకుడు కాలేడని మరో మంత్రి అంబటి సెటైర్లు వేశారు. అసలు లోకేష్ యాత్ర పరమార్థం వేరే ఉందని కొత్త లాజిక్ చెబుతున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేష్ పాదయాత్ర అధికారం కోసం కాదని, కేవలం పార్టీపై పెత్తనం కోసం అని అంటున్నారు. నందమూరి వారసులు పార్టీని లాగేసుకోకుండా ముందే లోకేష్ జాగ్రత్త పడుతున్నారని, అందుకే పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.

తన్ని తరిమేస్తారు..

లోకేష్ పాదయాత్ర చేసినా, ఇంకేం చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు కొడాలి నాని. కానీ నందమూరి వారసులనుంచి ముప్పు ఉంది కాబట్టి ఆయన ముందుగానే పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారని చెప్పారు. అసలు సొంత పార్టీ నేతలే లోకేష్ ని నాయకుడిగా ఒప్పుకోవడం లేదన్నారు. లోకేష్ వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు కొడాలి నాని. ఘోర పరాభవం తర్వాత చంద్రబాబు, లోకేష్ ని జనం తన్ని తరిమేస్తారని, అప్పుడు ఎన్టీఆర్ వారసులు పార్టీని హస్తగతం చేసుకుంటారని అన్నారు.

లోకేష్ హోదా ఏంటి..?

ఇప్పటి వరకు ఏపీలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి పాదయాత్రలు చేశారని.. ఏ అర్హతతో లోకేష్ ఇప్పుడు యాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు కొడాలి నాని. దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా ఎన్నికై, మూడు శాఖల మంత్రుల పదవులు చేపట్టి, మంగళగిరిలో చిత్తు చిత్తుగా లోకేష్ ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఇటువంటి పుప్పులు ఎన్ని పాదయాత్రలు చేసినా.. వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదన్నారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని.. ఎన్టీఆర్ వారసులు, సమర్థుల నుండి పార్టీని లాక్కోవడానికే ఈ పాదయాత్ర అని కొడాలి నాని విమర్శించారు.

First Published:  27 Jan 2023 12:09 PM GMT
Next Story