Telugu Global
Andhra Pradesh

శభాష్ లోకేష్...కార్యకర్తలను కాపాడుకోవడం అంటే ఇలా కదా!

టీడీపీతో ఉంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది, ఆపదలో మనకంటూ ఒక అండ ఉంటుంది.. పార్టీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగుతారన్న ఈ తరహా భరోసానే కాబోలు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పలుమార్లు ఓడినా ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆయన నాయకత్వానికి విధేయత, విశ్వాసం ప్రకటిస్తూ నిలబడుతున్నాయి.

శభాష్ లోకేష్...కార్యకర్తలను కాపాడుకోవడం అంటే ఇలా కదా!
X

విధానపరమైన అంశాలను పక్కన పెడితే చంద్రబాబు ఇన్ని దశాబ్దాల పాటు టీడీపీపై తన పట్టు సడలకుండా ఎలా నిలుపుకుంటున్నారు?. నిత్యం అధికార పక్షం కేసులు పెడుతున్నా టీడీపీ శ్రేణులు మరోసారి చంద్రబాబును సీఎం చేసేంతవరకు నిద్రపోం అన్నట్టుగా అంత కమిట్‌మెంట్‌ను ఎందుకు చూపుతున్నాయి?. ఒక పార్టీ శ్రేణులు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక నీరు గారిపోతుంటే.. టీడీపీ శ్రేణుల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఎందుకు ఉంటోంది?. చంద్రబాబు విషయంలోనే కాకుండా ఈ మధ్య నారా లోకేష్‌పైనా టీడీపీ శ్రేణులకు గురి ఎలా కుదిరింది?. ఇలాంటి ప్రశ్నలకు ఇటీవల నారా లోకేష్ స్పందిస్తున్న కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది.

ఒక జర్నలిస్ట్‌ తొలుత ఆంధ్రజ్యోతిలో కేరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ9లో చేరారు. అనంతరం సాక్షి మీడియాలో చాలా కాలం పనిచేశారు. అక్కడి నుంచి నారా లోకేష్ టీంలోకి వెళ్లారు. అలాఅని నారా లోకేష్‌తో ముఖాముఖి కూర్చునేంత ఉద్యోగమూ కాదు. లోకేష్ టీంలో ఒక సాధారణ స్కిప్ట్‌ రైటర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి గుండెపోటు వచ్చింది. విజయవాడలోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండెకు సంబంధించిన మూడు నాళాలు పూడిపోయాయని వైద్యులు చెప్పారు. బైపాస్ సర్జరీ తప్ప మరో దారి లేదన్నారు.

ఆ జర్నలిస్ట్‌ది ఆర్థికంగా అతి సాధారణ స్థితి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ తన పీఏను ఆస్పత్రికి పంపించారు. ఆ జర్నలిస్ట్‌ తమ టీం సభ్యుడని.. ఇకపై అతడిని మీరు ఒక్క రూపాయి కూడా అడగవద్దు.. అంతా నారా లోకేష్‌ చూసుకుంటారని ఆస్పత్రి వైద్యులకు లోకేష్ పీఏ హామీ ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ కూడా స్వయంగా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆ జర్నలిస్ట్‌కు వెంటనే ఆపరేషన్ చేయండి.. డబ్బు మేం చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.

దాంతో వెంటనే ఆ జర్నలిస్ట్‌కు బైపాస్‌ సర్జరీ చేశారు. చంద్రబాబు పీఏ కూడా ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ జర్నలిస్ట్‌కు కేవలం ఆపరేషన్‌ చేయించడమే కాదు.. రెండుమూడు నెలల పాటు అతడు జాబ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి.. ఆ జర్నలిస్ట్‌ భార్యకు కొద్దిమేర ఆర్థిక సాయం కూడా నారా లోకేష్ పంపించారు.

టీడీపీతో ఉంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది, ఆపదలో మనకంటూ ఒక అండ ఉంటుంది.. పార్టీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగుతారన్న ఈ తరహా భరోసానే కాబోలు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పలుమార్లు ఓడినా ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆయన నాయకత్వానికి విధేయత, విశ్వాసం ప్రకటిస్తూ నిలబడుతున్నాయి. పాలసీలు ఎలా ఉన్నా.. ఒక పార్టీని నడుపుతున్నప్పుడు,... అవసరానికి కార్యకర్తలను వాడుకున్నప్పుడు.. వారికి ఆపద వచ్చిన సమయంలో ఏ పార్టీ నాయకత్వాలైనా ఇదే తరహాలో స్పందించాలి. అప్పుడే గెలుపోటములకు అతీతంగా పార్టీలు నిలబడుతాయి.

First Published:  19 Sep 2022 11:05 AM GMT
Next Story