Telugu Global
Andhra Pradesh

గంజాయిపై గవర్నర్ కి లోకేష్ ఫిర్యాదు

దేశంలో ఎక్క‌డ గంజాయి దొరికినా అది మేడ్ ఇన్ ఆంధ్రా అంటున్నారని చెప్పారు లోకేష్. ఉడ్తా పంజాబ్ లాగా, ఉడ్తా ఆంధ్రప్రదేశ్ కాకూడదనే ఉద్దేశంతోనే తాను గవర్నర్ కి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.

గంజాయిపై గవర్నర్ కి లోకేష్ ఫిర్యాదు
X

యువగళం పాదయాత్రకు రెండు రోజులు సెలవు ప్రకటించిన నారా లోకేష్, తొలిరోజు కోర్టు పనులతో బిజీకాగా, రెండో రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ జాబ్ కేపిట‌ల్ గా ఉండేదని, జ‌గ‌న్ సీఎం అయ్యాక గంజాయి కేపిట‌ల్ గా మారింద‌న్నారు. బ‌డిలో, గుడిలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోందన్నారు. దేశంలో ఎక్క‌డ గంజాయి దొరికినా అది మేడ్ ఇన్ ఆంధ్రా అంటున్నారని చెప్పారు. ఉడ్తా పంజాబ్ లాగా, ఉడ్తా ఆంధ్రప్రదేశ్ కాకూడదనే ఉద్దేశంతోనే తాను గవర్నర్ కి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు లోకేష్.

చిత్తూరుజిల్లాలో ఓ బాలికను గంజాయికి బానిసగా చేసి, లైంగిక దాడి చేశారని, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలిపారు లోకేష్. యువగళం యాత్రలో చాలా చోట్ల గంజాయి బాధితుల్ని చూస్తున్నానని, వారి కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. టీడీపీ గంజాయిపై యుద్ధం ప్ర‌క‌టించిందన్నారు. `గంజాయి వ‌ద్దు బ్రో` పేరుతో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఏపీలో జరుగుతున్న నేరాలు, ఘోరాల వెనక గంజాయి ఉంటోందన్నారు లోకేష్. గంజాయి మ‌త్తులోనే అమ‌ర్ నాథ్ గౌడ్ అనే విద్యార్థిని వైసీపీ నేత‌లు త‌గల‌బెట్టార‌ని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు గంజాయి వ‌ల్లే ద‌ళిత డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంని దారుణంగా చంపి డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ చేశార‌ని అన్నారు. ఈ ఉదాహరణలన్నీ చెబుతూ ఆధారాల‌తో స‌హా గ‌వ‌ర్న‌ర్ కి ఫిర్యాదు చేశామన్నారు నారా లోకేష్. గంజాయి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సీఎం జగన్, రాంగోపాల్ వ‌ర్మతో త‌న‌పై సినిమా తీయించుకునే భేటీల‌లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు లోకేష్. గంజాయి మాఫియా వెనక వైసీపీ హస్తం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక త‌రాన్ని నాశ‌నం చేశార‌ని చెప్పారు.

పాదయాత్రలో తనపై దాడి చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని. కోడిగుడ్ల దాడి, రాళ్లదాడికి కూడా వారు తెగబడ్డారని, కొన్నిచోట్ల ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టాలని చూస్తున్నారని చెప్పారు. వీటన్నిటిపై గవర్నర్ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు లోకేష్. వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నారు లోకేష్. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల్లాగా పార్టీ అవసరాలోకోసం వాడుకోవడం తగదన్నారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచార సేకరణ చట్ట విరుద్ధం అన్నారు లోకేష్.

First Published:  15 July 2023 9:19 AM GMT
Next Story