Telugu Global
Andhra Pradesh

బౌన్సర్లు ఎందుకు పవన్..? బుద్ధిలేదా..?

నీఛ రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్ వంటి వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని అన్నారు ముద్రగడ. పేదల మనిషి జగన్ కే మళ్లీ పట్టం కడతారని చెప్పారు.

బౌన్సర్లు ఎందుకు పవన్..? బుద్ధిలేదా..?
X

పవన్ కల్యాణ్ బుద్ధిలేని పనులు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీనేత ముద్రగడ పద్మనాభం. ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇచ్చి మరీ బౌన్సర్లను పెట్టుకుంటున్నారని. చుట్టూ ఉన్న బౌన్సర్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దుమ్ము పడకూడదు, ధూళిపడకూడదు, నన్ను ఎవరూ ముట్టుకోకూడదు అంటే కుదరదని చెప్పారు. బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. అసలు పవన్ రాజకీయాలకు పనికిరారని తేల్చేశారు ముద్రగడ.

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ తన ప్రచారంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బౌన్సర్లను పెట్టుకుని జనం మధ్యలోకి వెళ్తున్నారు. వారితో ఇబ్బందిగా ఉందని, పవన్ దగ్గరకు వెళ్లనివ్వడం లేదని సామాన్యులనుంచి ఫిర్యాదులు అందడంతో.. ఇటీవల బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ డ్రామాలాడారు పవన్. తనపై, తన సెక్యూరిటీపై బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తోందని చెప్పారు. ఈ కవరింగ్ గేమ్ ఎలా ఉన్నా.. పవన్ బౌన్సర్లు మాత్రం పిఠాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిఠాపురం జనసేన అభ్యర్థిగా కాకుండా, పవన్ కల్యాణ్ ఓ సినిమా స్టార్ లాగా అక్కడ పర్యటిస్తున్నట్టుగా ఉందని విమర్శలు వినపడుతున్నాయి.

కాపు ద్రోహి చంద్రబాబు..

చంద్రబాబు, పవన్ వంటి నీఛ రాజకీయ నాయకులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని అన్నారు ముద్రగడ. పేదల మనిషి జగన్ కే మళ్లీ పట్టం కడతారని చెప్పారు. కాపుల ద్రోహి చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపుల ఆత్మ గౌరవాన్ని పవన్, చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.

First Published:  4 April 2024 2:57 AM GMT
Next Story