Telugu Global
Andhra Pradesh

ఈ జన్మకు మళ్లీ చంద్రబాబు సీఎం కాలేడు.. విజయ్ సాయి రెడ్డి ట్వీట్

తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అప్పుడు అభివృద్ధి చేయలేక ఇప్పుడు మళ్లీ చివరి ఛాన్స్ అంటూ జనాన్ని వేడుకోవడంపై ఎద్దేవా చేశారు.

ఈ జన్మకు మళ్లీ చంద్రబాబు సీఎం కాలేడు.. విజయ్ సాయి రెడ్డి ట్వీట్
X

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటనలో నోరు జారి అన్నాడో.. లేక ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఒక వ్యూహం మేరకు అన్నాడో తెలియదు కానీ.. ఇవే తనకు చివరి ఎన్నికలు..అని ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు ఇవే నాకు చివరి ఎన్నికలు అని అలా అన్నాడో లేదో వైసీపీ మంత్రులు వరుసగా ఆయన్ను ఆడేసుకోవడం మొదలుపెట్టారు.

జాలితో ప్రజలు ఓటు వేయరని, సమర్థతను చూసే ఓటు వేస్తారని..చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు, అప్పలరాజు, అమర్నాథ్ విమర్శించారు. తథాస్తు దేవతలు ఉంటారని చంద్రబాబు అన్న మాటలు నిజం కావొచ్చని మరో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అప్పుడు అభివృద్ధి చేయలేక ఇప్పుడు మళ్లీ చివరి ఛాన్స్ అంటూ జనాన్ని వేడుకోవడంపై ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇక ఈ జన్మలో మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్ళీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకు మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు' అని ట్వీట్ చేశారు. కాగా ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


First Published:  17 Nov 2022 11:31 AM GMT
Next Story