Telugu Global
Andhra Pradesh

ఎవరెలాంటివారో తెలిసింది.. ఎమ్మెల్యే శ్రీదేవి ఘాటు ట్వీట్

టీడీపీలో తనకు టికెట్ లేదు అని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతుకోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు చెబుతున్నారు.

ఎవరెలాంటివారో తెలిసింది.. ఎమ్మెల్యే శ్రీదేవి ఘాటు ట్వీట్
X

లబ్ డబ్ అని కాదు, జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుందంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జగన్ తో విభేదించి టీడీపీలో చేరారామె. కొన్నాళ్లు పరిస్థితులు బాగానే ఉన్నాయి. తీరా ఎన్నికల టైమ్ లో చంద్రబాబు మార్కు వెన్నుపోటు ఏంటో రుచి చూశారు శ్రీదేవి. అందుకే కత్తి ఫొటో పెడుతూ ఓ హాట్ కామెంట్ చేశారు. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! అంటూ ట్వీట్ చేశారు.


చంద్రబాబుని నమ్ముకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా ఎమ్మెల్యే శ్రీదేవికి తెలిసొచ్చింది. టీడీపీలో చేరే సమయంలో ఆమెకు టికెట్ కూడా ఆఫర్ చేశారు చంద్రబాబు. తాను ప్రాతినిధ్యం వహించే తాడికొండలోనే టీడీపీ టికెట్ పై పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పారామె. అది కుదరకపోతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన తిరువూరు అసెంబ్లీ, లేదా బాపట్ల లోక్ సభ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరారు. తీరా ఈరోజు రిలీజ్ చేసిన లిస్ట్ లో ఆమెకు ఛాన్స్ లేదని తేలిపోయింది. ఆమె కోరిన మూడు నియోజకవర్గాల్లోనూ వేరే వారికి అవకాశమిచ్చారు చంద్రబాబు. ఉండవల్లి శ్రీదేవికి షాకిచ్చారు.

టీడీపీలో తనకు టికెట్ లేదు అని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతుకోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒకేసారి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీనుంచి ఫిరాయించి టీడీపీలో చేరగా.. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇదివరకే హ్యాండివ్వగా.. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి కూడా సీటు లేదని క్లారిటీ ఇచ్చారు.

First Published:  22 March 2024 8:53 AM GMT
Next Story