Telugu Global
Andhra Pradesh

మిషన్ రాయలసీమ.. టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా..?

చెప్పుకోడానికేమీ లేదు కాబట్టే, ఇంకోసారి అధికారమివ్వండి ఐదేళ్లలో రూపురేఖలు మార్చేస్తామంటున్నారు లోకేష్. వినడానికి కొత్తగా ఉన్నా, తమ అసమర్థతను మరోసారి ఆయన బయటపెట్టుకున్నట్టయిందని వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి.

మిషన్ రాయలసీమ.. టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా..?
X

రాయలసీమ వెనకబడిపోయింది, రాయలసీమలో అభివృద్ధి కుంటుపడింది. మేం అధికారంలోకి వస్తే ఐదేళ్లలోనే రాయలసీమ రూపురేఖలు మార్చేస్తాం. ఈ హామీలు ఇస్తోంది ఏదో కొత్త పార్టీ కాదు, పోనీ అధికారంలోకి రాని పార్టీయా అంటే అదీ కాదు. 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన రికార్డ్ నాది అని చెప్పుకునే చంద్రబాబు పార్టీ. మరి బాబు పాలనలో ఆయన రాయలసీమను పట్టించుకోలేదా..? రాయలసీమలో పుట్టిపెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకి సీమ కష్టాలు తెలియనివా..? ఈ తప్పులన్నీ ఇప్పుడు టీడీపీయే ఒప్పుకున్నట్టయింది. మిషన్ రాయలసీమ అనే మీటింగ్ తో అన్నీ కొత్తగా చేస్తామని చెబుతున్న నారా లోకేష్, ఇప్పటి వరకూ ఏమీ చేయలేకపోయామనే విషయాన్ని ఒప్పుకున్నారు. యువగళంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో అరాచకం జరిగిపోయింది అనుకుంటే.. అంతకు ముందు అసలు రాయలసీమ ఎంత గొప్పగా ఉండేదో చెప్పుకోవాలి కదా. అలా చెప్పుకోడానికి లోకేష్ వద్ద ఏమీ లేదు. కియా కంపెనీ పేరుతో పదే పదే ఎంతని హడావిడి చేస్తారు. చెప్పుకోడానికేమీ లేదు కాబట్టే, ఇంకోసారి అధికారమివ్వండి ఐదేళ్లలో రూపురేఖలు మార్చేస్తామంటున్నారు లోకేష్. వినడానికి కొత్తగా ఉన్నా, తమ అసమర్థతను మరోసారి ఆయన బయటపెట్టుకున్నట్టయిందని వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి.

భారీ హామీలు..

యువగళం పాదయాత్రలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు లోకేష్. కడప నగరంలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి చర్చా వేదిక నిర్వహించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం, వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, రాయలసీమకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, శ్రీశైలం కేంద్రంగా పర్యాటక అభివృద్ధి.. ఇలా మిషన్ రాయలసీమలో చాలానే హామీలిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తి చేసి ఉంటే ఇప్పుడిలా కొత్త హామీలిచ్చే అవసరం ఉండేది కాదు కదా అంటున్నారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకోకుండా, ఇప్పుడు కొత్త పార్టీలాగా, కొత్తగా అధికారం కావాలంటూ లోకేష్ హామీలివ్వడం హాస్యాస్పదం అని విమర్శిస్తున్నారు. చేసిన తప్పులన్నిటినీ లోకేష్ కడపలో ఒప్పేసుకున్నారని అంటున్నారు.

First Published:  8 Jun 2023 2:51 AM GMT
Next Story