Telugu Global
Andhra Pradesh

పులివెందుల చెక్ పోస్ట్ కూడా తాకలేరు జాగ్రత్త.. రోజా వార్నింగ్

గతంలో 23మంది వైసీపీని వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టయిందని, ఒక్కరు కూడా గెలవలేదని, ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అన్నారు రోజా.

పులివెందుల చెక్ పోస్ట్ కూడా తాకలేరు జాగ్రత్త.. రోజా వార్నింగ్
X

వైనాట్ పులివెందుల అంటూ ఇటీవల కొంతమంది అతిగా మాట్లాడుతున్నారని, వారందరికీ 2024 ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు మంత్రి రోజా. పులివెందుల కాదు కదా, పులివెందుల ముందు ఉన్న చెక్ పోస్ట్ కూడా చంద్రబాబు తాకలేరని అన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. వందరెట్లు వేగంగా ముందుకొచ్చి వేటాడుతుందని, ఆ విషయం అందరూ గుర్తుంచుకోవాలని, జగన్ ని తక్కువ అంచనా వేయొద్దన్నారు.

వారంతా చరిత్ర హీనులు..

పార్టీలు మారినవారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు మంత్రి రోజా. నలుగురు ఎమ్మెల్యేలు ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. గతంలో 23మంది వైసీపీని వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టయిందని, ఒక్కరు కూడా గెలవలేదని, ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అన్నారు రోజా.

జగన్ మళ్లీ తయారు చేస్తారు..

ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి ఏమీ కాదని, నాయకుల్ని తయారు చేసుకునే సత్తా జగన్ కి ఉందన్నారు రోజా. గతంలో 23మంది ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు కూడా జగన్ బాధపడలేదని, అక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేశారని, వైసీపీ తరపున గెలిచినవారంతా జగన్ క్రేజ్ వల్లే గెలిచారని చెప్పారు. జగన్ లేనిదే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ లేరన్నారు. కొత్తవారిని సైతం తన చరిష్మాతో గెలిపించగల సత్తా జగన్ కి ఉందన్నారు రోజా.

175 గ్యారెంటీ..

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రోజా. ఒక్క ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తాము వైసీపీకే ఓటు వేశామంటూ డ్రామాలాడుతున్నారని, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినవారెవరూ బాగుపడిన దాఖలాలు లేవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అందరికీ బుద్ధి చెబుతామన్నారు.

First Published:  26 March 2023 10:00 AM GMT
Next Story