Telugu Global
Andhra Pradesh

అటు వయో వృద్ధుడు.. ఇటు అసమర్థుడు..

అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆయన హయాంలోనే శాశ్వత కట్టడాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. విభజిత రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రాబాబుదేనన్నారు.

అటు వయో వృద్ధుడు.. ఇటు అసమర్థుడు..
X

టీడీపీకి ఓవైపు వయోవృద్ధుడు, ఇంకోవైపు అసమర్థుడు తయారయ్యారని.. వారిద్దరి మధ్య ఆ పార్టీ, పార్టీ నేతలు నలిగిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై ఆమె సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్ర రోజు రోజుకి జోకేష్‌ పాదయాత్రలా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో యువగళం జబర్దస్త్ కి పోటీగా నిలబడుతుందని కౌంటర్ ఇచ్చారు.

అవే చివరి రోజులు..

పొరపాటున ఏపీ ప్రజలు చంద్రబాబుకి అవకాశం ఇస్తే, అవే రాష్ట్రానికి చివరి రోజులు అవుతాయని హెచ్చరించారు మంత్రి రోజా. మూడు రాజధానులపై చంద్రబాబు చేసిన కామెంట్లకు కూడా బదులిచ్చారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆయన హయాంలోనే శాశ్వత కట్టడాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. విభజిత రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రాబాబుదేనన్నారు. పరిపాలన వికేంద్రకరణతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే.. ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు రోజా. కర్నూలుకి న్యాయ రాజధాని రావడం రాయలసీమ బిడ్డగా తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు.

విశాఖలో డ్రామాలు..

అన్ స్టాపబుల్ షో లో పవన్ కల్యాణ్ విశాఖ ఎపిసోడ్ ని గుర్తు చేయడంపై కూడా రోజా స్పందించారు. ఆనాడు విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్‌ అక్కడకు వచ్చారని అన్నారు రోజా. జనసేన అభిమానులతో మంత్రుల కార్ల అద్దాలను పగలకొట్టించి విశాఖ గర్జనను డైవర్ట్ చేయాలనుకున్నారని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా, యువగళంతో వచ్చినా వారాహితో వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు రోజా.

First Published:  10 Feb 2023 8:32 AM GMT
Next Story