Telugu Global
Andhra Pradesh

అన్నీ కనిపెట్టిన చంద్రబాబుకి కొడుకుని గెలిపించుకోవడం తెలియదా..?

ఖమ్మం నా గుమ్మం అంటున్న చంద్రబాబు.. తనకు జీవితాన్నిచ్చిన కుప్పం ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు రోజా. చంద్రబాబుకి మతి భ్రమించిందని అన్నారు.

అన్నీ కనిపెట్టిన చంద్రబాబుకి కొడుకుని గెలిపించుకోవడం తెలియదా..?
X

సెల్ ఫోన్ కనిపెట్టానంటాడు, సాఫ్ట్ వేర్ కనిపెట్టానంటాడు.. ఆఖరికి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా తానేనంటున్న చంద్రబాబు.. కనీసం కొడుకు నారా లోకేష్ ని ఎందుకు గెలిపించుకోలేకపోయాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి రోజా. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షంలో కూడా ఉండలేక ఖమ్మం వెళ్లి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తట్టుకోలేక చంద్రబాబు తెలంగాణకు పారిపోయారని విమర్శించారు.

ఖమ్మం నీ గుమ్మమా..?

ఖమ్మం నా గుమ్మం అంటున్న చంద్రబాబు.. తనకు జీవితాన్నిచ్చిన కుప్పం ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు రోజా. చంద్రబాబుకి మతి భ్రమించిందని అన్నారు. చంద్రబాబు కుప్పంలో కూడా గెలవలేరన్నారు. ఖమ్మం చంద్రబాబు గుమ్మమేమీ కాదని, ఆయనను రెండు రాష్ట్రాలూ తిరస్కరించాయని చెప్పారు.

ఖమ్మం సభతో ఒరిగిందేమీ లేదా..?

ఖమ్మం సభ సూపర్ హిట్ అయిందని, జనాలు తండోపతండాలుగా వచ్చారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. అదే సమయంలో ఖమ్మం సభ వల్ల చంద్రబాబుకి ఒరిగిందేమీ లేదనే వాదన కూడా వినపడుతోంది. పైగా అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ రెండు పార్టీలనుంచి చంద్రబాబుకి చాకిరేవు పెట్టారు నేతలు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అంటూ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీని అప్పులపాలు చేసి ప్రజల ఛీత్కారానికి గురైన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తాననడం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తున్నారు. 2019లో ఇక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పుకి చంద్రబాబు మతి భ్రమించిందని, 2024లో ఓటమి ఖాయం అని తేలిపోవడంతో ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారన్నారు ఏపీ మంత్రి రోజా.

First Published:  22 Dec 2022 4:32 PM GMT
Next Story