Telugu Global
Andhra Pradesh

రజినీ..! నీకేం తెలియదు -రోజా

నిన్నటి సభలో రజినీకాంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయనతో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని విమర్శించారు మంత్రి రోజా.

రజినీ..! నీకేం తెలియదు -రోజా
X

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్.. చంద్రబాబు విజన్ గురించి గొప్పగా చెప్పడం వైసీపీ నేతలకు రుచించలేదు. మంత్రి రోజా నేరుగా రజినీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రజినీకాంత్‌ కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని విమర్శించారామె. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని చెప్పారు.

రజినీ చెప్పినవన్నీ అబద్ధాలే..

నిన్నటి సభలో రజినీకాంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయనతో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని విమర్శించారు మంత్రి రోజా. అసలు చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌ కు వీడియోలు పంపిస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌ పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని, ఆ విషయం రజినీకి తెలియకపోవడం దురదృష్టకరం అన్నారు. ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులను బాధపెట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారన్నారు.

చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్సార్‌ అని, చంద్రబాబు కాదని.. ఆ విషయం రజినీకాంత్‌ తెలుసుకోవాలన్నారు రోజా. ఫీజు రీఎంబర్స్ మెంట్ తెచ్చింది వైఎస్సార్ అని, చంద్రబాబు కాదన్నారు. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని, విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా? అని ప్రశ్నించారు. చంద్రబాబుని పొగిడి.. తెలుగు ప్రజలకు ఆయనపై ఉన్నగౌరవాన్ని రజినీ తగ్గించుకున్నారని చెప్పారు రోజా.

అప్పుడెందుకు తెచ్చుకోలేదు..

భారత రత్న అవార్డు గురించి ఇప్పుడింతలా గింజుకుంటున్న చంద్రబాబు.. 27 ఏళ్లలో ఎన్టీఆర్‌ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు మంత్రి రోజా. ఎన్టీఆర్‌ ని యుగపురుషుడు అంటున్న చంద్రబాబు, ఆయనకి ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు. రజినీ చెప్పినా, చెప్పకపోయినా 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు రోజా.

First Published:  29 April 2023 5:52 AM GMT
Next Story