Telugu Global
Andhra Pradesh

డోస్ పెంచిన వైసీపీ.. షర్మిలపై రోజా ఘాటు వ్యాఖ్యలు

మంత్రి రోజా.. షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెను తెలంగాణలో జనం ఛీకొట్టారన్నారు.

డోస్ పెంచిన వైసీపీ.. షర్మిలపై రోజా ఘాటు వ్యాఖ్యలు
X

తెలంగాణలో జనం ఛీకొడితే షర్మిల ఇక్కడికి వచ్చారని పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి పదవి తెచ్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల లాగా.. ఎన్నికల టైమ్ లో వచ్చే రాజకీయ నాయకుల్ని జనం ఎవరూ నమ్మబోరన్నారు. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి ఏపీ ప్రజలు పిచ్చోళ్లు కాదన్నారు రోజా. తమతో ఉంటున్నదెవరు, తమ సమస్యల కోసం పోరాడిందెవరు, అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరు.. అనే విషయాలు ప్రజలందరికీ తెలుసన్నారు.

జగన్ ని వేలెత్తి చూపిస్తారా..?

రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా, ఏరోజూ తలొగ్గలేదన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఏ పార్టీలోనూ విలీనం చేయలేదని, దమ్మున్న నాయకుడి లక్షణం అదని చెప్పారు. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి, ప్రజలు ఛీకొడితే ఇక్కడికొచ్చి విమర్శలు చేస్తే ఎవరూ నమ్మబోరన్నారు రోజా.

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల నేరుగా ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొదట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. కాస్త సీరియస్ గా రియాక్ట్ అయినా ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం మంత్రులకు దక్కింది. మహిళా మంత్రి రోజా.. షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెను తెలంగాణలో జనం ఛీకొట్టారన్నారు. మరి షర్మిల ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతారా, లేక తన టార్గెట్ కేవలం జగనన్నే అంటారా..? వేచి చూడాలి.

First Published:  27 Jan 2024 3:27 AM GMT
Next Story