Telugu Global
Andhra Pradesh

అది ఫ్యాషన్ షో.. ఇది పాడుతా తీయగా

నిజం గెలిచి చంద్రబాబు జైలులో ఉండాలని భువనేశ్వరి యాత్ర చేపడుతున్నట్టుగా ఉందని అన్నారు మంత్రి రోజా. భువనేశ్వరి కాస్త గట్టిగా పూజలు చేశారని సెటైర్లు పేల్చారు.

అది ఫ్యాషన్ షో.. ఇది పాడుతా తీయగా
X

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి రోజా. యాత్ర చేయాలంటే మామూలు విషయం కాదన్నారు. ఏదో ఫ్యాషన్ షో లకు వెళ్లినట్టు, జాలీగా వెళ్తున్నవారు యాత్ర ఎలా చేస్తారంటూ సెటైర్లు పేల్చారు. తండ్రి మీద చెప్పులేసినప్పుడు, తండ్రి నుంచి పార్టీని లాక్కొన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు కూడా వారు హ్యాపీగా ఉన్నారని, వారిలో బాధే లేదని.. ఇప్పుడు వారికి ఎక్కడి నుంచి బాధ వస్తుందని, ప్రజల కోసం వారు ఎలా కష్టపడతారని ప్రశ్నించారు. యాత్ర చేయలేక నారా లోకేష్ యువగళానికి మంగళం పాడేశారని ఎద్దేవా చేశారు రోజా.

భువనేశ్వరి యాత్ర దేనికోసం..?

నిజం గెలిచి చంద్రబాబు జైలులో ఉండాలని భువనేశ్వరి యాత్ర చేపడుతున్నట్టుగా ఉందని అన్నారు మంత్రి రోజా. తిరుమలలో నారా భువనేశ్వరి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. రోజా కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. భువనేశ్వరి కాస్త గట్టిగా పూజలు చేశారని సెటైర్లు పేల్చారు. తాను కూడా నిజం గెలవాలనే కోరుకున్నానని.. నిజం గెలిచిందంటే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు రోజా. నిజం గెలవాలని భువనేశ్వరి సీబీఐ ఎంక్వయిరీ కోరాలన్నారు. నిజం గెలిస్తే చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, లోకేష్ కూడా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు రోజా.

పాడుతా తీయగా..

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ మీటింగ్ పై కూడా తనదైన శైలిలో పంచ్ లు విసిరారు రోజా. అటు కొంతమంది, ఇటు కొంతమంది టేబుళ్లు వేసుకుని కూర్చుని.. పాడుతా తీయగా కార్యక్రమానికి సెలక్షన్లు చేసినట్టుగా ఆ ప్రోగ్రామ్ ఉందన్నారు. అర సున్న, అర సున్న కూర్చుని లోపన ఉన్న గుండు సున్న కోసం పనిచేసినట్టు ఉందన్నారు. పవన్, లోకేష్ ఇద్దరినీ ప్రజలు ఓడించారని, అలాంటి వాళ్లు రాష్ట్రానికి దశ, దిశ చూపించడమేంటని ప్రజలు అనుకుంటున్నారని.. ఇదేమి కర్మరా బాబూ ఆని వారి పార్టీవాళ్లే వాపోతున్నారని చెప్పారు. మేనిఫెస్టో హామీలను 98శాతం అమలు చేశామని, ఇంటింటికీ వెళ్లి వై ఏపీ నీడ్స్ జగన్ అని వివరిస్తున్నామని అన్నారు మంత్రి రోజా. ఏపీ ప్రజలు 2024 జగనన్న వన్స్ మోర్ అంటున్నారని చెప్పారు.


First Published:  24 Oct 2023 8:12 AM GMT
Next Story