Telugu Global
Andhra Pradesh

పోస్టర్‌పై ఫొటో ఎందుకు లేదు లోకేష్‌..?

ఇయర్ ఎండింగ్ లో చంద్రబాబు దరిద్రపు రాజకీయం కారణంగా ఎనిమిది మంది చనిపోతే, కొత్త ఏడాది ప్రారంభం రోజే మరో ముగ్గురు చనిపోయారని రోజా ధ్వ‌జ‌మెత్తారు.

పోస్టర్‌పై ఫొటో ఎందుకు లేదు లోకేష్‌..?
X

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు సభల్లో వరుసగా ఇంతమంది చనిపోతున్నా మిగిలిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా విమర్శించడం లేదని, ఏ మీడియా సంస్థ చర్చ పెట్టడం లేదని.. దీన్ని బట్టే చంద్రబాబు విసిరే గింజలకు ఆశపడి మౌనంగా ఉంటున్నారు అని అర్థమవుతోందన్నారు. ఇయర్ ఎండింగ్ లో చంద్రబాబు దరిద్రపు రాజకీయం కారణంగా ఎనిమిది మంది చనిపోతే, కొత్త ఏడాది ప్రారంభం రోజే మరో ముగ్గురు చనిపోయారని రోజా ధ్వ‌జ‌మెత్తారు.

తన మనవడితో ఆడుకునేందుకు టైం లేదని చెప్పే చంద్రబాబు నాయుడు.. ప్రజలు ఓడించిన తర్వాత అయినా ఇలాంటి రాజకీయాలు వదిలేసి మనవడితో ఆడుకోవచ్చు కదా అని రోజా సలహా ఇచ్చారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఘటనలు సృష్టిస్తుందని సిగ్గులేకుండా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నం తింటున్నారా..? మరేమైనా తింటున్నారా..? అన్న అనుమానం కలుగుతుందన్నారు. టోకెన్లు పంపిణీ చేసింది టిడిపి వాళ్ళు, ఐదారు గంటలపాటు మహిళల్ని ఎదురు చూసేలా చేసింది టిడిపి వాళ్ళు అయినప్పుడు ఇందులో వైసిపి ప్రమేయం ఎక్కడ ఉంటుందని నిలదీశారు. ఈ వరుస ఘటనలు చూసిన తర్వాత ప్రజలు ఈయన చంద్రబాబునాయుడా లేక శవాలనాయుడా అన్న భయానికి గురవుతున్నారని మంత్రి విమర్శించారు.

లోకేష్ పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా ఏమైపోతుందో అని టిడిపి నేతల్లోనే భయం మొద‌లైంద‌ని ఎద్దేవా చేశారు. తండ్రితో పాటు గోదావరి పుష్కరాల్లో నారా లోకేష్ పాల్గొన్నప్పుడు 32 మంది చనిపోయారని, నారా లోకేష్ ఎమ్మెల్సీ అయిన రోజే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసు వచ్చిందని, లోకేష్ కుప్పంలో ప్రచారానికి వెళ్ళగానే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, నారా లోకేష్ పాదయాత్ర అనౌన్స్ చేసిన రోజే కందుకూరులో 8 మంది చనిపోయారని, ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇక నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఏమైపోతుందో అన్న భయం టిడిపి నేతల్లో మొద‌లైంద‌ని రోజా వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ పూర్తి గందరగోళ పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నారా లోకేష్ పాదయాత్ర పోస్టర్ నిదర్శనం అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్లో చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం ఏంటని ఆమె నిలదీశారు. సొంత కొడుకునైన త‌న‌ను పట్టించుకోకుండా తన తండ్రి.. దత్తపుత్రుడు వెంట పడుతున్నారన్న కోపం లోకేష్‌లో ఉంది కాబ‌ట్టే ఆ పోస్టర్‌లో చంద్రబాబు ఫొటో లేదని రోజా విమర్శించారు. ఒకచోట ఓడిపోయిన నారా లోకేష్ కంటే రెండు చోట్ల ఓడిపోయిన దత్తపుత్రుడే నయమని చంద్రబాబునాయుడు అనుకున్నప్పుడు నారా లోకేష్ కు కోపం రావడం సహజమన్నారు.

First Published:  2 Jan 2023 10:20 AM GMT
Next Story