అమరావతి రాజధానిని కట్టలేమని చంద్రబాబుకు కూడా తెలుసు - మంత్రి రోజా
అమరావతి రాజధాని పేరుతో భ్రమలు కల్పిస్తూ.. అభూత కల్పనలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు.
చంద్రబాబు తీసుకొచ్చిన అమరావతి రాజధాని భ్రమరావతి మాత్రమేనని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల రూపాయల కంటే అధికంగా వ్యయం అవుతుందని ఆమె తెలిపారు. ఇంత భారీ వ్యయంతో అమరావతి రాజధాని నిర్మించలేమనే విషయం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసని మంత్రి రోజా అన్నారు. తన హయాంలోనే ఆయన అమరావతి రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేసింది రూ.5,700 కోట్లని మంత్రి వివరించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమే.. లక్షల కోట్ల వ్యయం అయ్యే అమరావతి రాజధాని నిర్మాణం.. ఏటా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ.. ఉద్యోగులకు జీతాలు ఇస్తూ.. ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తే.. వందేళ్లకు కూడా పూర్తికాదని ఆమె స్పష్టం చేశారు. రూ.10 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో పాలనా రాజధాని నిర్మించడం తేలిగ్గా పూర్తవుతుందని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
మూడు రాజధానులకు అడ్డంకులు తొలగిపోవాలని కోరుతూ.. రాష్ట్రమంతటా అభివృద్ధి వికేంద్రీకరణ నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ.. విజయవాడలో బుధవారం విజయదశమి సందర్భంగా మంత్రి రోజా దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పేరుతో భ్రమలు కల్పిస్తూ.. అభూత కల్పనలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ అన్ని ప్రాంతాల ప్రజల ఆశీస్సులతో విజయం సాధించారని, అందుకే రాష్ట్ర మంతటా.. ప్రజలందరూ అభివృద్ధిని అందుకోవాలని ఒక తండ్రిలా కోరుకుంటున్నారని, అదే క్రమంలో ముందుకు సాగుతున్నారని రోజా చెప్పారు. అందరినీ ఆదుకుంటూ జగన్ పాలన సాగిస్తుంటే.. దీనిని చూసి తట్టుకోలేని చంద్రబాబు రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. 29 గ్రామాల్లో ఉన్నవారే రైతులా.. మిగిలిన 26 జిల్లాల్లో ఉన్న రైతులు అభివృద్ధి చెందొద్దా.. అని ఆమె ప్రశ్నించారు.
నాడు తెలంగాణ నుంచి ఓటుకు నోటు వంటి వెధవ పని చేసి పారిపోయి వచ్చిన చంద్రబాబు.. విభజన ప్రయోజనాలు రాష్ట్రం పొందకుండా చేశారని మంత్రి రోజా విమర్శించారు. ఇప్పుడు అమరావతి రాజధాని పేరుతో మళ్లీ రాష్ట్ర ప్రజలు నష్టపోయేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.