Telugu Global
Andhra Pradesh

బాబు అసెంబ్లీకి రాడు.. మేం ఆయన నియోజకవర్గానికి వెళ్తున్నాం..

30 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేయలేని పనులను జగన్ పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. కుప్పంకు మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేశామని గుర్తుచేశారు మంత్రి పెద్దిరెడ్డి.

బాబు అసెంబ్లీకి రాడు.. మేం ఆయన నియోజకవర్గానికి వెళ్తున్నాం..
X

అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని, కానీ తమ ప్రభుత్వం ఆయన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తన నియోజకవర్గాన్ని 30 ఏళ్లుగా పట్టించుకోలేదని, వైసీపీ హయాంలోనే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి పర్యవేక్షించారు. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ లతో శాంతిపురంలో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కుప్పం ఇక మనదే..

వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం జగన్ స్వయంగా వస్తున్నారని చెప్పారు. 30 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేయలేని పనులను జగన్ పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. కుప్పంకు మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేశామని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో ప్రజల్లో తమ పార్టీపై ఉన్న అభిమానం బయటపడిందని, వారు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అబద్ధాలను కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకి పరాజయం తప్పదన్నారు. తమ అంచనా నిజమైతే బాబు కుప్పం వదిలి పారిపోతారని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని, ఆ వివరాలు వెబ్‌సైట్‌ లో కూడా ఉన్నాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ వివరాలు చూసుకుని ఏవైనా తప్పులుంటే టీడీపీ నేతలే చెప్పాలని హితవు పలికారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి.

First Published:  19 Sep 2022 3:05 AM GMT
Next Story