Telugu Global
Andhra Pradesh

ఎన్ని అబద్ధాలైనా ఆడగల వ్యక్తి చంద్రబాబు

కుట్రపూరిత చర్యల ద్వారా వృద్ధులను ఇబ్బంది పెట్టిన, మరికొందరి ప్రాణాలు పోయేందుకు కారణమైన చంద్రబాబుకు ఆ అవ్వాతాతల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.

ఎన్ని అబద్ధాలైనా ఆడగల వ్యక్తి చంద్రబాబు
X

ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్ధాలైనా అల‌వోక‌గా ఆడగల వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు అని ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సందర్భంగా 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అసలు మ్యానిఫెస్టోనే కనబడకుండా మాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఇంటివద్దకే సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు చేసిన కుట్ర వల్ల పింఛన్ల కోసం వృద్ధులు దూర ప్రాంతాలకు మండుటెండలో వెళుతూ అష్టకష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆయన తెలిపారు.

కుట్రపూరిత చర్యల ద్వారా వృద్ధులను ఇబ్బంది పెట్టిన, మరికొందరి ప్రాణాలు పోయేందుకు కారణమైన చంద్రబాబుకు ఆ అవ్వాతాతల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. 2014లో ఇచ్చిన హామీలనే అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు రూ.4 వేలు చొప్పున పింఛను ఇస్తానని మరో అబద్ధం చెబుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చినా తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని ఆయన చెప్పారు.

First Published:  6 April 2024 2:13 PM GMT
Next Story