Telugu Global
Andhra Pradesh

అది చంద్రబాబు కుట్రే.. టీడీపీలో చేరితే బావిలో దూకినట్టే..!

జగన్ పేరుతో, జగన్ పార్టీ బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇప్పుడు పార్టీనే ధిక్కరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి బెదిరింపులు చూసి జగన్ భయపడే రకం కాదన్నారు.

అది చంద్రబాబు కుట్రే.. టీడీపీలో చేరితే బావిలో దూకినట్టే..!
X

వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనక చంద్రబాబు ఉన్నారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుట్రతోనే వారు ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీలో చేరితే బావిలో దూకినట్టేనని అన్నారు. పార్టీలు మారే వారి వల్ల వైసీపీకి నష్టమేమీ లేదని, భవిష్యత్తులో వారి వల్ల పార్టీ బలహీనపడే పరిస్థితి కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరుగుతుందని, కేవలం టీడీపీతో లాలూచీ పడి, వారి ప్లాన్ లో భాగంగానే ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని మండిపడ్డారు.

జగన్ లేకపోతే వారు ఎవరు..?

జగన్ లేకపోతే, జగన్ పార్టీ పెట్టకపోతే వారంతా ఎమ్మల్యేలు అయ్యేవారా అని నిలదీశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ పేరుతో, జగన్ పార్టీ బలంతో ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇప్పుడు పార్టీనే ధిక్కరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి బెదిరింపులు చూసి జగన్ భయపడే రకం కాదన్నారు. టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని, కానీ ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు పెద్దిరెడ్డి.

పాదయాత్రే టీడీపీకి గుదిబండ..

నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కూడా సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి. పాదయాత్ర ఆ పార్టీకి మేలుచేయదు సరికదా, గుదిబండగా మారుతుందని అన్నారు. ఆ పాదయాత్ర వల్లే టీడీపీ మరింత నాశనమైపోతుందని చెప్పారు. లోకేష్ యాత్రలో కనీసం వందమంది కూడా కనపడ్డం లేదని, కేవలం మీడియా హైప్ తప్ప అక్కడేమీ లేదన్నారు. సామాన్య ప్రజలు కూడా లోకేష్ యాత్రను పట్టించుకోవడంలేదన్నారు. గతంలో జగన్ యాత్ర చేసినప్పుడు ప్రజలు ప్రభంజనంలా తరలి వచ్చారని, లోకేష్ యాత్రకు అస్సలు ఆదరణ లేదన్నారు పెద్దిరెడ్డి.

First Published:  2 Feb 2023 11:46 AM GMT
Next Story