Telugu Global
Andhra Pradesh

మైఖేల్ జాక్సన్ లా ఆ వేషమేంటి..? చంద్రబాబుపై కాకాణి సెటైర్లు

చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని, ఒక రోజు ఆంధ్రాలో ఉంటే, ఇంకోరోజు తెలంగాణలో ఉంటారని, ఓరోజు బీజేపీని తిడితే, తర్వాత రోజు వారినే పొగుడుతారని, ఇంకోరోజు సీపీఐ, సీపీఎం పంచన చేరాలనుకుంటారని చెప్పారు కాకాణి.

మైఖేల్ జాక్సన్ లా ఆ వేషమేంటి..? చంద్రబాబుపై కాకాణి సెటైర్లు
X

ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇటీవల చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చేతిలో మైక్ లేకుండా వైర్ లెస్ హెడ్ సెట్ ద్వారా ఆయన ప్రసంగిస్తున్నారు. ఆ వ్యవహార శైలి అచ్చు మైఖేల్ జాక్సన్ ని పోలి ఉందని సెటైర్లు పేల్చారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. మైఖేల్ జాక్సన్ లా వేషం వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఊగిపోతూ చంద్రబాబు ప్రసంగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

దత్తపుత్రుడే దిక్కు..

చంద్రబాబుకి సొంత పుత్రుడిపై నమ్మకం లేక, దత్త పుత్రుడిని తెచ్చుకున్నారని అన్నారు కాకాణి. బహిరంగ సభలో సైకిల్ వద్దు అని ఆయనే చెప్పుకుంటున్నారని, ఆయనకు మతి భ్రమించిందని అన్నారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని, ఒక రోజు ఆంధ్రాలో ఉంటే, ఇంకోరోజు తెలంగాణలో ఉంటారని, ఓరోజు బీజేపీని తిడితే, తర్వాత రోజు వారినే పొగుడుతారని, ఇంకోరోజు సీపీఐ, సీపీఎం పంచన చేరాలనుకుంటారని చెప్పారు. అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాకు ఎన్నోసార్లు వచ్చిన చంద్రబాబు.. సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

రైతులకిచ్చే పాస్ బుక్కులపై జగన్ ఫొటో ఎందుకని ఏడుస్తున్న చంద్రబాబు గతంలో ఎస్సీ కార్పొరేషన్ వాహనాలపై తన ఫొటో వేసుకోలేదా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన.. కనీసం తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారని, చివరకు జగన్ ని బతిమిలాడుకుని ఆ పని చేయించుకున్నారని చెప్పారు. జగన్ ఇక్కడే చదువుకుని ముఖ్యమంత్రి అయ్యారని, లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు విదేశాలకు పంపించి చదివిస్తే, అక్కడ అమ్మాయిలను పెట్టుకుని విలాసాలు అనుభవించి తిరిగొచ్చాడని, ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయాడని సెటైర్లు పేల్చారు.

First Published:  24 Dec 2022 4:17 PM GMT
Next Story