Telugu Global
Andhra Pradesh

టీడీపీని జనం మర్చిపోతారనే భయంతోనే రోజుకో డ్రామా

వారు ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయం నిలకడగా ఉంటుందన్నారు. అవినీతిలో అడ్డంగా దొరికిపోతే ఎటువంటి వారైనా న్యాయస్థానం తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనని చెప్పారు.

టీడీపీని జనం మర్చిపోతారనే భయంతోనే రోజుకో డ్రామా
X

తెలుగుదేశం పార్టీని జనం మర్చిపోతారనే భయంతోనే ఆ పార్టీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. వారు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం వారి పిలుపులకు స్పందించడం లేదని ఆయన చెప్పారు. మచిలీపట్నంలో ఆదివారం ఆయన మీడియా మాట్లాడుతూ టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరని తెలిపారు. టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి, లైట్లు ఆపి, కృష్ణానదిలో దూకి.. ఇలా వేషాలన్నీ వేశారని విమర్శించారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపితే పీడాపోతుందని ఆయన చెప్పారు.

వారు ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయం నిలకడగా ఉంటుందన్నారు. అవినీతిలో అడ్డంగా దొరికిపోతే ఎటువంటి వారైనా న్యాయస్థానం తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనని చెప్పారు. పవన్‌ అవనిగడ్డ సభ ఫ్లాప్‌ అయ్యిందని, పెడన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని, వారాహి ఫ్లాప్‌ అవ్వడంతో దానికి పవన్‌ ప్యాకప్‌ చెప్పేశారని మంత్రి తెలిపారు. చంద్రబాబు జైల్లో, లోకేశ్‌ ఢిల్లీలో, దత్తపుత్రుడు ఎక్కడో ఉంటూ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

First Published:  16 Oct 2023 1:34 AM GMT
Next Story