Telugu Global
Andhra Pradesh

స్కాంలో పాత్ర ఉంటే అధికారులపైనా చర్యలు తీసుకుంటాం - మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్‌ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదని బొత్స ప్రశ్నించారు. మధ్యలో డిజైన్‌ టెక్‌ ఎలా వచ్చిందని నిలదీశారు. చంద్రబాబు తెలిసే తప్పు చేశారని బొత్స చెప్పారు.

స్కాంలో పాత్ర ఉంటే అధికారులపైనా చర్యలు తీసుకుంటాం  - మంత్రి బొత్స సత్యనారాయణ
X

అవినీతి చేసినవారు ఎంతటివారైనా సహించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అవినీతిని సహించదని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్‌ స్కామ్‌లో అధికారుల పాత్ర ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్కిల్‌ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డిపై తమకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని బొత్స చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్నాళ్లూ దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా వ్యవహరించారని, ఇన్నాళ్లూ తప్పులు చేసినా ఆయన దొరకలేదని.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని తెలిపారు.

చంద్రబాబు తెలిసే తప్పు చేశారు...

రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్‌ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదని బొత్స ప్రశ్నించారు. మధ్యలో డిజైన్‌ టెక్‌ ఎలా వచ్చిందని నిలదీశారు. చంద్రబాబు తెలిసే తప్పు చేశారని బొత్స చెప్పారు. సీమెన్స్‌ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్‌వేర్‌.. ఎక్విప్‌మెంట్‌ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అన్యాక్రాంతం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలు ఉన్నాయని చెప్పారు.


First Published:  23 Sep 2023 9:56 AM GMT
Next Story