Telugu Global
Andhra Pradesh

లోకేష్‌ని నమ్ముకుంటే.. టీడీపీ నేతలు బంగాళాఖాతంలోకే.. - మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక

సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

లోకేష్‌ని నమ్ముకుంటే.. టీడీపీ నేతలు బంగాళాఖాతంలోకే..  - మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టయి రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారని.. ఈ నేపథ్యంలో పార్టీని బతికించడానికంటూ చంద్రబాబు తనయుడు లోకేష్‌ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లోకేష్‌ టీడీపీని బతికించడానికి పనికిరాడని ఆయన స్పష్టం చేశారు. అతన్ని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు బంగాళాఖాతంలోకి వెళతారని మంత్రి హెచ్చరించారు.

మంత్రి అంబటి రాంబాబు ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు ఎవ్వరూ మద్దతుగా లేరని గుర్తుచేశారు. పవన్‌ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో ఉన్న ఒప్పందం వల్ల పవన్‌ వచ్చాడని ఆయన చెప్పారు.

చంద్రబాబును సీఐడీ అధికారులు సాక్ష్యాధారాలతోనే అరెస్టు చేశారని మంత్రి అంబటి తెలిపారు. కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే చంద్రబాబును రిమాండుకు పంపిందన్నారు. అయినా.. లోకేష్‌ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. పవన్‌ కల్యాణ్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదని ఈ సందర్భంగా అంబటి ఎద్దేవా చేశారు. విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే తప్పా అని నిలదీశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పొలిటికల్‌ డ్రామా మొదలుపెడుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు. సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పారు. నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారని ఆయన స్పష్టం చేశారు.


First Published:  22 Oct 2023 2:31 PM GMT
Next Story