Telugu Global
Andhra Pradesh

టీడీపీని క్షమించనన్నావ్.. మళ్లీ అదే పంచన చేరుతున్నావేంటీ.. పవన్‌పై అంబటి ఫైర్

తాను ప్రచారం చేయడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు.

టీడీపీని క్షమించనన్నావ్.. మళ్లీ అదే పంచన చేరుతున్నావేంటీ.. పవన్‌పై అంబటి ఫైర్
X

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కొన్ని నెలల నుంచి జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఆ రెండు పార్టీలు సన్నిహితంగా మెలుగుతున్నాయి. వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిసి చంద్రబాబు మద్దతు ప్రకటించగా.. ఇటీవల కుప్పం ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి.

అయితే పవన్ చంద్రబాబును కలిసినప్పటి నుంచి వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని లోకేష్ ని క్షమించను అని.. ఆవేశంగా డైలాగులు చెప్పావు కదా.. మరి అవన్నీ మరచి మళ్లీ చంద్రబాబుతో ఎలా కలుస్తున్నావు.. అని మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే టీడీపీ, జనసేన మధ్య దూరం పెరిగింది.


తాను ప్రచారం చేయడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. నువ్వు ప్రచారం చేయడం వల్ల మాకేమీ ఓట్లు పడలేదని కించపరుస్తూ మాట్లాడారు. ఆ పరిణామాలు జరిగిన సమయంలో 'నేను ప్రచారం చేసి టీడీపీని గెలిపిస్తే.. మీరు నా తల్లిని అవమానించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను క్షమించను. ఖబడ్దార్' అంటూ పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన సభలో కామెంట్స్ చేశారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో షేర్ చేశారు. టీడీపీని, లోకేష్ ను క్షమించను.. ఖబడ్దార్.. అన్న వ్యక్తివి మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఎలా సిద్ధం అయ్యావు.. అంటూ విమర్శలు చేశారు. అంబటి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.

First Published:  12 Jan 2023 8:38 AM GMT
Next Story