Telugu Global
Andhra Pradesh

అలా చేస్తే.. నిజం గెలుస్తుందట! - భువనేశ్వరికి మంత్రి అంబటి సలహా

మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో మీరు విచారణకు ఆహ్వానించండి. అప్పుడు నిజం తప్పక గెలుస్తుంది అని.. భువనేశ్వరి చేస్తున్నది సానుభూతి యాత్ర అని అంబటి చెప్పారు.

అలా చేస్తే.. నిజం గెలుస్తుందట!  - భువనేశ్వరికి మంత్రి అంబటి సలహా
X

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి... రిమాండ్‌పై జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమెకు మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఓ సలహా ఇచ్చారు. నిజం గెలవాలంటూ యాత్ర చేస్తున్న భువనేశ్వరి నిజంగా నిజం గెలవాలంటే ఓ పని చేయాలన్నారు. అదేంటంటే.. మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో మీరు విచారణకు ఆహ్వానించండి. అప్పుడు నిజం తప్పక గెలుస్తుంది.. అని. భువనేశ్వరి చేస్తున్నది సానుభూతి యాత్ర అని ఈ సందర్భంగా అంబటి చెప్పారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు నిజం గెలవాలంటూ భువనేశ్వరి ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని అంబ‌టి తెలిపారు. అలా కాకుండా అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి.. అని ఉద్యమం చేస్తే అప్పుడు చంద్రబాబుకు ఉపయోగం ఉండవచ్చని ఆయన సెటైర్లు వేశారు.

యాత్రలో భాగంగా భువనేశ్వరి చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. బాబు ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడ్డారని చెబుతున్నారని.. అదే నిజమైతే 2019లో ప్రజలు ఆయన్ని ఎందుకు తిరస్కరించారని అంబటి ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారంటూ అంబటి నిలదీశారు.

ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చెప్పారా.. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా.. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా.. రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా.. అంటూ ప్రశ్నించారు. ఆయన చేసిందల్లా.. అధికారం, ధనబలంతో నిజాన్ని తొక్కిపెట్టడమేనని అంబటి తెలిపారు.

First Published:  27 Oct 2023 4:49 AM GMT
Next Story