Telugu Global
Andhra Pradesh

బాబుకు కళ్ళు కనిపించడం లేదనే బెయిల్.. అంబటి సెటైర్లు

నిజం గెలిచిందని.. అందుకే బాబుకు బెయిల్ వచ్చిందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

బాబుకు కళ్ళు కనిపించడం లేదనే బెయిల్.. అంబటి సెటైర్లు
X

స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో 53 రోజుల తర్వాత ఇవాళ చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే నిజం గెలిచిందని.. అందువల్లే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబుకు కళ్ళు కనిపించకపోవడం వల్లే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని సెటైర్ వేశారు.

స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబు 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ రాలేదు. అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తిరిగి జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది.

చంద్రబాబుకు బెయిల్ లభించడంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. నిజం గెలిచిందని.. అందుకే బాబుకు బెయిల్ వచ్చిందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్ళు కనిపించడం లేదనే మధ్యంతర బెయిల్ వచ్చిందంటూ సెటైర్ వేశారు.

First Published:  31 Oct 2023 7:10 AM GMT
Next Story