Telugu Global
Andhra Pradesh

ఒళ్లు బలిసినోళ్ల యాత్ర.. అంబటిపై భారీగా ట్రోలింగ్

అప్పట్లో అమరావతి రైతులకు అండగా ఉంటామన్న అంబటి వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ.. అప్పుటి అమాయక రైతులు ఇప్పుడు ఒళ్లు బలిసినోళ్లు ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

ఒళ్లు బలిసినోళ్ల యాత్ర.. అంబటిపై భారీగా ట్రోలింగ్
X

అమరావతి పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అటు రైతులు కూడా రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. మహిళలు తొడగొట్టడం, మగాళ్లు మీసం మెలేసి సవాళ్లు విసరడం.. ఇలా సాగుతోంది ఆ యాత్ర. దీంతో ఇటువైపు నుంచి రియాక్షన్స్ ఇంకా దారుణంగా ఉంటున్నాయి. మహిళలతో తొడ కొట్టించిన టీడీపీ, జంబలకిడి పంబ పార్టీ అంటూ మంత్రి రోజా విమర్శిస్తే, మరో మంత్రి అంబటి రాంబాబు ఇంకాస్త ఘాటుగా స్పందించారు. అది ఒళ్లు బలిసినోళ్ల యాత్ర అంటూ కామెంట్ చేశారు. దీంతో అంబటిపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ విరుచుకుపడుతోంది. అయితే ఏమాత్రం చలించని అంబటి మరోసారి అదే రిపీట్ చేస్తానన్నారు, చేశారు.

"అన్నాను...అంటాను...

మళ్ళీ మళ్ళీ అంటాను...

అది వొళ్ళుబలిసినోళ్ల పాదయాత్ర !"

ఇదీ అంబటి లేటెస్ట్ రియాక్షన్. దీంతో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అంబటి పాత వీడియోలన్నీ వెలుగులోకి తీసుకొస్తూ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు.

ప్రతిపక్షంలో ఉండగా అంబటి రాంబాబు సహా చాలామంది నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడారు. అమరావతికే తమ మద్దతు అని చెప్పుకొచ్చారు. రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా తాము అండగా నిలబడతామన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న టీడీపీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి మూలనపడింది, మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. నాయకులంతా ప్లేటు ఫిరాయించారు. అప్పుడు అమరావతి అన్నవారు ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. దీంతో గత వీడియోలను టీడీపీ ఇప్పుడు వెలికి తీస్తోంది. అప్పట్లో అమరావతి రైతులకు అండగా ఉంటామన్న అంబటి వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ.. అప్పుటి అమాయక రైతులు ఇప్పుడు ఒళ్లు బలిసినోళ్లు ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

గతంలో అంబటి ఆడియో లీక్ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు కొంతమంది బయటకు తెస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు ఇలాంటి భాష మాట్లాడకూడదని హితవు పలుకుతున్నారు. మంత్రులు మాట్లాడితే చర్యలు ఉండవని, తమబోటి సామాన్యులు నోరు జారితే కేసులు, అరెస్ట్‌ల‌ పేరుతో వేధిస్తారని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఒళ్లు బలిసినోళ్ల యాత్ర అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంబటిపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది.

First Published:  28 Sep 2022 2:41 AM GMT
Next Story