Telugu Global
Andhra Pradesh

మార్గదర్శి కేసుపై సీఐడీ లేటెస్ట్ ప్రెస్ మీట్

మార్గదర్శిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్. వీటిలో రెండు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, మిగతా ఐదు కేసుల్లో విచారణ తుదిదశకు వచ్చిందన్నారు.

మార్గదర్శి కేసుపై సీఐడీ లేటెస్ట్ ప్రెస్ మీట్
X

మార్గదర్శి కేసు కార్పొరేట్ ఫ్రాడ్ అని అన్నారు ఏపీ సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్. డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు మార్గదర్శిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. వీటిలో రెండు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, మిగతా ఐదు కేసుల్లో విచారణ తుదిదశకు వచ్చిందన్నారు. మార్గదర్శి కేసుల విచారణ తాజా సమాచారాన్ని ఆయన మీడియా సమావేశంలో వివరించారు.

మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని తెలిపారు ఎస్పీ అమిత్‌ బర్దర్‌. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడంతోపాటు, పలు తప్పులు చేశారని, లెక్కలు మార్చారని, అంతిమంగా డిపాజిట్ దారులకు వ్యతిరేకంగా మోసపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మార్గదర్శి కేసుల్లో సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు.

మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేపట్టినట్టు తెలిపిన ఎస్పీ అమిత్ బర్దర్.. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మొత్తంగా 1035 కోట్ల రూపాయల చరాస్తులు అటాచ్ చేసినట్టు తెలిపారు. కోర్టులోనూ అటాచ్ మెంట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసుల్లో 15 మందిపై చార్జిషీట్ వేశామన్నారు. ఆ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ అని చెప్పారు.

త్వరలో చార్జి షీట్లు..

త్వరలోనే మిగిలిన ఆ 5 కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తామన్నారు సీఐడీ ఎస్పీ. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించిందని, డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా నిబంధనలు చదవాలని సూచించారు.

First Published:  28 July 2023 1:32 PM GMT
Next Story