Telugu Global
Andhra Pradesh

ఏపీకి ఇది ‘తీపి’ కబురేనా..

దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన కార్యకలాపాలను నిర్వ‌హిస్తోన్న‌ మాండలేజ్ సంస్థ రూ.4 వేల కోట్లతో విస్తరణ కార్యక్రమాలకు సిద్ధపడింది. ఇందులో భాగంగానే ఏపీలో రూ.1600 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ యూనిట్, గోడౌన్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది.

ఏపీకి ఇది ‘తీపి’ కబురేనా..
X

ఈనెల మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ, విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, కుమారమంగళం బిర్లా, కరణ్ అదాని, నవీన్ జిందాల్,గ్రంధి మల్లికార్జునరావులాంటి పారిశ్రామికవేత్తలతో పాటు యోకోహమా, కియా మోటార్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఏపీలో పెట్టుబడులకు రూ.13.5 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జ‌రిగాయి.

ఇందులో భాగంగానే ఒక ఎంవోయు ఆచరణలోకి రాబోతోంది. మాండలేజ్ ఏపీలో రూ.1600 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. మాండలేజ్ ఇండియా అంటే అందరికీ తెలియకపోవచ్చు. అయితే క్యాడబరీస్ డెయిరీ మిల్క్ చాక్లెట్ తయారీ సంస్థ‌ అంటే మాత్రం అందరికీ అర్థ‌మైపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన కార్యకలాపాలను మాండలేజ్ నిర్వహిస్తోంది. ఇలాంటి కంపెనీ రూ.4 వేల కోట్లతో విస్తరణ కార్యక్రమాలకు సిద్ధపడింది.

ఇందులో భాగంగానే ఏపీలో రూ.1600 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ యూనిట్, గోడౌన్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. జగన్‌తో కలిసిన తర్వాత పరిశ్రమల ఉన్నతాధికారులతో కూడా కంపెనీ ప్రతినిధులు మాట్లాడినట్లు కంపెనీ ఎండీ దీపక్ అయ్యర్ ప్రకటించారు. కంపెనీ ఉత్పత్తి యూనిట్‌కు అవసరమైన, అనువైన స్థ‌లాన్ని ఎంపిక చేసుకోగానే నిర్మాణాలను మొదలుపెట్టబోతున్నట్లు దీపక్ చెప్పారు.

పరిశ్రమల శాఖ అధికారులతో చర్చించినట్లు చెప్పిన దీపక్ తొందరలోనే స్థ‌లాల‌ పరిశీలన పూర్తి చేస్తామన్నారు. సంస్థ‌ ఎండీయే ఈ విషయాలను చెప్పారు కాబట్టి జనాల్లో కూడా నమ్మకం ఏర్పడుతుంది. నిజానికి ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థ‌ల్లో సగం వాస్తవ రూపంలోకి వచ్చినా ప్రభుత్వం గొప్పగా సాధించినట్లే లెక్క. ఎందుకంటే ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థ‌ల్లో చాలా సంస్థ‌లు ఏదో కారణంగా వెనక్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఎంవోయులు కుదుర్చుకున్న పరిశ్రమలతో రెగ్యులర్‌గా చర్చించేందుకు, ఫాలోఅప్ చేసేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జగన్ కమిటీని నియమించింది. బహుశా క్యాడబరీస్ కంపెనీ ఏపీలోకి రావటానికి ఈ ఫాలో అప్పే కారణమేమో.

First Published:  25 March 2023 6:15 AM GMT
Next Story