Telugu Global
Andhra Pradesh

'మణప్పురం' లవ్ స్టోరీ.. పోలీసులకు దొరికిన బ్రాంచ్ మేనేజర్

బంగారం దొంగతనం తర్వాత అందులో 6 కేజీలను తన ప్రియుడికి ఇచ్చి, తన దగ్గర నాలుగున్నర కేజీల బంగారం ఉంచుకుంది పావని. తాత్కాలికంగా మకాం షిరిడీకి మార్చింది.

మణప్పురం లవ్ స్టోరీ.. పోలీసులకు దొరికిన బ్రాంచ్ మేనేజర్
X

ఇటీవల విజయవాడలోని కంకిపాడు 'మణప్పురం గోల్డ్ లోన్' బ్రాంచ్ లో పదిన్నర కేజీల బంగారం దొంగతనం సంచలనంగా మారింది. బ్రాంచ్ మేనేజర్ పావని ఈ దొంగతనం చేసిందని సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అదే రోజు నిర్థారణ అయింది. అయితే ఓ మహిళ ఇంత ధైర్యంగా బంగారం దొంగతనం చేయడం, పైగా పనిచేస్తున్న సంస్థకే కన్నం వేయడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. విచారణలో అసలు విషయం తేలింది. ఆమె లవ్ స్టోరీ బయటపడింది. లవర్ కోసం బంగారం దొంగతనం చేసిన పావని ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లింది.

భర్తకు దూరంగా ఉంటున్న పావనికి ఇటీవల మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు గతంలో ప్రైవేట్ స్కూల్స్ నడిపి అప్పులపాలయ్యాడు. పావని పరిచయంతో ఏకంగా 'మణప్పురం'కే కన్నం వేద్దామని ప్లాన్ చేశాడు. ఆ బంగారం అమ్మేసుకుని విదేశాలకు వెళ్లి జల్సా చేద్దామని పావనిని నమ్మించాడు. దీంతో ఆమె మేనేజర్ పోస్ట్ లో ఉన్నాననే స్పృహ కూడా కోల్పోయింది. ఇటీవల అందరికంటే ముందే బ్రాంచ్ కి వచ్చి లాకర్ తెలిసి 10.6 కేజీల బంగారం బ్యాగ్ లో సర్దేసుకుని వెళ్లిపోయింది, ఫోన్ స్విచాఫ్ చేసింది. సిబ్బంది బ్యాంక్ కి వచ్చి చూస్తే అసలు విషయం బయటపడింది, సీసీ టీవీ ఫుటేజీతో మేనేజరే దొంగ అని తేలింది.

బంగారం దొంగతనం తర్వాత అందులో 6 కేజీలను తన ప్రియుడికి ఇచ్చి, తన దగ్గర నాలుగున్నర కేజీల బంగారం ఉంచుకుంది పావని. తాత్కాలికంగా మకాం షిరిడీకి మార్చింది. పోలీసులు ఆమె ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు. సిగ్నల్స్ ఆధారంగా షిరిడీలో ఉందని నిర్థారించుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడిని కూడా పట్టుకున్నారు. వారి వద్దనుంచి బంగారం రికవరీ చేశారు.

First Published:  26 Oct 2023 1:28 AM GMT
Next Story