Telugu Global
Andhra Pradesh

రాజమండ్రి జైలులో ఖైదీ మృతి.. లోకేష్ ట్వీట్ వైరల్

తన తండ్రిని కూడా అలాగే అంతమొందించేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు లోకేష్. దోమలతో కుట్టి కుట్టి చంపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు సంధించారు.

రాజమండ్రి జైలులో ఖైదీ మృతి.. లోకేష్ ట్వీట్ వైరల్
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ డెంగ్యూతో మృతి చెందిన వార్తను హైలైట్ చేస్తూ నారా లోకేష్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన తండ్రిని కూడా అలాగే అంతమొందించేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని అన్నారాయన. దోమలతో కుట్టి కుట్టి చంపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు సంధించారు.


జైలులో దోమల బెడద..

చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించింది, జైలులోనే ఆయన్ను అంతం చేసేందుకే.. అనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు నారా లోకేష్. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ చేశారు లోకేష్. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందన్నారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదని, విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు లోకేష్. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడంటూ ఓ వార్తని ట్యాగ్ చేశారు. చంద్రబాబుని కూడా ఇలాగే చంపేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యత అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

విజయసాయి కౌంటర్లు..

జైలులో దోమల గోలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో చంద్రబాబు ఫ్యాన్ వాడకూడదనే నియమం ఏమీలేద్నారాయన. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి, ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవని చెప్పారు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా? అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

*


First Published:  21 Sep 2023 6:38 AM GMT
Next Story