Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులు..

సిగ్గు, లజ్జ లేని చంద్రబాబు లాంటి వాళ్లకు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. తాను బ్రతికి ఉండకపోతే ఎప్పుడో టీడీపీ నుంచి ఎన్టీఆర్ ఫోటో తీసేసేవాళ్ళని అన్నారు లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులు..
X

ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం చేయడానికి తనకు మాత్రమే అర్హత ఉందని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే చంద్రబాబుకి ఆ మహానుభావుడు గుర్తొస్తాడని మండిపడ్డారు. సిగ్గు లజ్జ లేని చంద్రబాబు లాంటి వాళ్లకు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. తాను బ్రతికి ఉండకపోతే ఎప్పుడో టీడీపీ నుంచి ఎన్టీఆర్ ఫోటో తీసేసేవాళ్ళని అన్నారు లక్ష్మీపార్వతి. బావ కళ్లలో సంతోషం చూడటానికి బాలకృష్ణ పని చేస్తున్నారని, వాళ్ళది కృత్రిమ ప్రేమ అని ప్రజలకు అర్ధమైపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఉన్నది అధికార కాంక్ష మాత్రమేనన్నారు.

ఎన్టీఆర్ మరణానంతరం విజ్ఞాన్ ట్రస్టు స్ధాపించి ఎన్టీఆర్ అవార్డులు ఇచ్చామని గుర్తు చేశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం చరిష్మా ఉందన్నారు. ఆయన పోలికలు కూడా జూనియర్ కే వచ్చాయని చెప్పారు. జూనియర్ గురించి భయపడే చంద్రబాబు తన కొడుకుని తెరపైకి తెచ్చాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వద్ద హరికృష్ణకు జరిగిన అవమానం కారణంగానే కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నారని అన్నారు లక్ష్మీపార్వతి.

అది ఒక తీర్మానం మాత్రమే..

ఎన్టీఆర్ కు భారతరత్న అనేది ఒక మహానాడు తీర్మానం మాత్రమేనని, ఆ తర్వాత చంద్రబాబు దాన్ని చెత్తబుట్టలో వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి. అందితే కాళ్లు, అందకపోతే జుట్టు పట్టుకునే విధానం చంద్రబాబుదని చెప్పారు. అసలు టీడీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆశయాలు నీరుగార్చిన చంద్రబాబు.. టీడీపీకి వారసుడు ఎలా అవుతాడని అన్నారు. ఆ యుగపురుషుడిని దారుణంగా అవమానించి ఇప్పుడు ఆయన పేరు స్మరించడానికి నోరెలా వస్తోందన్నారు. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గొప్పవారని చెప్పారు లక్ష్మీపార్వతి.

First Published:  27 May 2023 5:14 PM GMT
Next Story