Telugu Global
Andhra Pradesh

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
X

సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

జర్నలిస్టులకు గుడ్‌ న్యూస్‌..

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపింది. 5 సంవత్సరాల పాటు అక్రెడిటేషన్‌ ఉన్నవారికి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా స్థలాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై విధివిధానాలు ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కావాల్సి ఉంది.

కులగణనకు ఆమోదం...

రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్‌ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8 కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్‌కు పురపాలక శాఖ ప్రతిపాదించింది.

First Published:  3 Nov 2023 10:08 AM GMT
Next Story