Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశంలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ‌

ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దాన్ని నాశనం చేయాలని, అందుకోసం రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

తెలుగుదేశంలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ‌
X

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొద్ది సేపటిక్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేతుల మీదుగా కన్నా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కన్నా వేలాది మంది కార్యకర్తలతో కలిసి గుంటూరు నుంచి తాడేపల్లికి ర్యాలీగా వచ్చారు. ఆయనను స్వాగతించిన చంద్రబాబు ఆయ‌న మెడలో పచ్చకండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కన్నా లక్ష్మినారాయణ వంటి గొప్ప నాయకుడు టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. ఆయనగానీ , తాను కానీ ఎన్నడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, రాజకీయ విమర్శలకే పరిమితమయ్యామన్నారు. కన్నా ఏ పార్టీలో ఉన్నప్పటికీ గొప్ప ప్రజాబలం ఉన్న నాయకుడని అన్నారు.

ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని దాన్ని నాశనం చేయాలని అందుకోసం రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తాను జీవితాంతం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడనని, అలాంటి తాను టీడీపీలో చేరడం పై అనేక మందికి అనుమానంగా ఉండవచ్చని అన్నారు కన్నా. అయితే తాను చంద్రబాబుపై పోరాడింది వ్యక్తిగతంగా కాదని, రాజకీయపరంగానే అని కన్నా చెప్పారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలనను కూలదోయడానికి, అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి, రాష్ట్ర అభివృద్ది జరగడానికి తాను టీడీపీలో చేరుతున్నాను అని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు.

First Published:  23 Feb 2023 10:06 AM GMT
Next Story