Telugu Global
Andhra Pradesh

టార్గెట్ లోకేష్.. యువగళం దారిలో జూనియర్ ఫ్లెక్సీలు

పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు సహా ఇతర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే వెంటనే వాటిని టీడీపీ శ్రేణులు తొలగించాయి.

టార్గెట్ లోకేష్.. యువగళం దారిలో జూనియర్ ఫ్లెక్సీలు
X

ఇటీవల నారా లోకేష్ యువగళం మీటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ తోపాటు రాష్ట్ర బాగు కోరుకునే యువత ఎవరైనా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు లోకేష్. ఎన్టీఆర్ ని కూడా కచ్చితంగా ఆహ్వానిస్తామన్నారు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీలోకి ఆయన్ను ఆహ్వానించడానికి అసలు లోకేష్ ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేతలు. వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా.. ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు లోకేష్ కి అసలు సెగ తగిలింది. యువగళం యాత్ర దారిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు లోకేష్ ని ఇబ్బంది పెడుతున్నాయి.

చిత్తూరు జిల్లా పీలేరులో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు సహా ఇతర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే వెంటనే వాటిని టీడీపీ శ్రేణులు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్‌ పాదయాత్ర పీలేరులో ప్రవేశిస్తుంది. సరిగ్గా ఆయన ఎంట్రీ ఇచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడటం విశేషం.

లోకేష్ ని టార్గెట్ చేశారా..?

ఆమధ్య కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు మారుమోగాయి. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండా కూడా ఎగరేశారు. ఆ తర్వాత ఆ ప్రస్తావన కాస్త తగ్గినా, ఇటీవల నారా లోకేష్ యువగళం మీటింగ్ లో ఎన్టీఆర్ ప్రస్తావనతో మళ్లీ ఆయన పేరు హైలెట్ అయింది. దానికి తోడు వైసీపీ నేతలు కూడా టీడీపీని రక్షించేది ఒక్క ఎన్టీఆరేనంటూ కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే పీలేరులో ఫ్లెక్సీలు జూనియర్ అభిమానులు వేయించారా, లేక నారా లోకేష్ అంటే గిట్టనివారు వేయించారా అనేది తేలాల్సి ఉంది. ఎవరు వేయించినా టీడీపీ నాయకులు వాటిని తొలగించడం మాత్రం విశేషం.

First Published:  5 March 2023 12:57 PM GMT
Next Story