Telugu Global
Andhra Pradesh

సీనియ‌ర్ జేసీ.. మ‌ళ్లీ రాజ‌కీయాల‌కేసి..

మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు ఆరంభించారు జేసీ దివాక‌ర్‌రెడ్డి. సొంత మండ‌ల‌మైన‌ పెద్దపుప్పూరు నుంచే తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. సింగనగుట్టపల్లె గ్రామంలో న‌డుచుకుంటూ వీధివీధి తిరిగి జ‌నాల్ని ప‌ల‌క‌రించారు.

సీనియ‌ర్ జేసీ.. మ‌ళ్లీ రాజ‌కీయాల‌కేసి..
X

వివాదాల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌. మాట‌లతో మంట‌లు రేపే సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. తిడ‌తాడు.. క్ష‌ణాల్లో క్ష‌మాప‌ణ చెబుతాడు.. స్వ‌ప‌క్ష‌మైనా, విప‌క్ష‌మైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌తాడు.. ఆయ‌నే జేసీ దివాక‌ర్‌రెడ్డి.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ రాజ‌కీయాలు న‌డిపి అలిసిపోయారేమో ఎనిమిది ప‌దుల వ‌య‌స్సులో రాజ‌కీయాల‌కు కాస్త విరామం ప్ర‌క‌టించారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు, మీడియాకు కూడా దూరంగా వుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న కుమారుడు జేసీ ప‌వ‌న్‌రెడ్డి మాత్ర‌మే పోటీలో వుంటార‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన సీనియ‌ర్ జేసీ హైద‌రాబాద్‌, తాడిప‌త్రిలో ఎక్కువ స‌మ‌యంలో ఇంట్లోనే వుంటున్నారు.

ఇటీవ‌ల హైద‌రాబాద్ నుంచి తాడిపత్రిలోని స్వగృహానికి చేరుకున్న జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌ళ్లీ ప‌ల్లెబాట ప‌ట్టారు. జేసీ ఇంటికి జ‌నం కూడా క్యూ కడుతున్నారు. అభిమానులు నేరుగా ఇంటికొచ్చి త‌మ ఊరు రావాలంటే త‌మ ఊరు రావాలంటూ పోటీప‌డి జేసీని ఆహ్వానిస్తున్నారు. దీంతో మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు ఆరంభించారు జేసీ దివాక‌ర్‌రెడ్డి. సొంత మండ‌ల‌మైన‌ పెద్దపుప్పూరు నుంచే తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. సింగనగుట్టపల్లె గ్రామంలో న‌డుచుకుంటూ వీధివీధి తిరిగి జ‌నాల్ని ప‌ల‌క‌రించారు. ఇక‌పై తాను కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అందుబాటులో వుంటాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జేసి దివాక‌ర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌ల్లెల ప‌ర్య‌ట‌న‌లు ఆరంభించారు.

First Published:  19 Aug 2022 2:19 PM GMT
Next Story