Telugu Global
Andhra Pradesh

బందరు పోర్ట్ కి మూడోసారి శంకుస్థాపన..

ప్రస్తుతం ఏపీలో విశాఖ మేజర్ పోర్ట్ సహా.. 5 నాన్ మేజర్ పోర్ట్ లు ఉన్నాయి. వీటికి తోడు మరో నాలుగు పోర్ట్ లను ఏపీ మారిటైమ్ బోర్డ్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో బందరు పోర్ట్ కూడా ఉంది.

YS Jagan Mohan Reddy to lay foundation for Machilipatnam Port today
X

బందరు పోర్ట్ కి మూడోసారి శంకుస్థాపన..

కృష్ణా జిల్లాలోని బందరు పోర్టుకు సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. అయితే ఇది మూడోసారి అంటూ ప్రతిపక్షాలు వెటకారమాడుతున్నాయి. వాస్తవానికి బందరు పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చిన కరగ్రహారం పల్లిపాలెం దగ్గర మొదటి సారి శంకుస్థాపన జరిగింది. అదే పోర్ట్ కి 2019 ఫిబ్రవరి 7న చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం మేకవానిపాలెం దగ్గర జరిగింది. కానీ అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు శంకుస్థాపన సీఎం జగన్ చేస్తున్నారు. ఈసారి తపసిపూడి గ్రామ పరిధిలో భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ ఉన్నాయి.

ప్రస్తుతం ఏపీలో విశాఖ మేజర్ పోర్ట్ సహా.. 5 నాన్ మేజర్ పోర్ట్ లు ఉన్నాయి. వీటికి తోడు మరో నాలుగు పోర్ట్ లను ఏపీ మారిటైమ్ బోర్డ్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో బందరు పోర్ట్ కూడా ఉంది. పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకోసం కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. దీనికోసం 4వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించి సేకరిస్తోంది.

బందరు పోర్ట్ విశేషాలు..

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లుగా నిర్థారించారు. ఈ పోర్ట్ ద్వారా ఏడాదికి 35.12 మిలియన్‌ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. 4 బెర్త్ లు నిర్మిస్తున్నారు. 1923ఎకరాల విస్తీర్ణంలో పోర్ట్ పనులు జరుగుతాయి. పోర్ట్ కోసం కొత్తగా 6.5 కి.మీ. మేర ఫోర్ లైన్ హైవే నిర్మిస్తారు. పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మిస్తారు.

2019 ఎన్నికలు దగ్గరపడిన సందర్భంలో చంద్రబాబు హడావిడిగా పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారనేది వాస్తవం. అప్పటికి పోర్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయి అనుమతులు రాలేదు, నిధుల కేటాయింపు కూడా లేదు. ఓ తాపీమేస్త్రి సాయంతో చంద్రబాబు బందర్ పోర్ట్ అనే ప్రాజెక్ట్ తలపెట్టారని వైసీపీ నేతలు సెటైర్లు పేల్చారు కూడా. ఇప్పుడు పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసి, నిధులు మంజూరు చేయిస్తూ వైసీపీ హయాంలో పోర్ట్ పనులు మొదలు కాబోతున్నాయి. అందుకే సీఎం జగన్ మరోసారి భూమిపూజ చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.

First Published:  22 May 2023 2:34 AM GMT
Next Story