Telugu Global
Andhra Pradesh

జగన్ మాస్టర్ స్ట్రోక్

సచివాలయ వ్యవస్థ‌కు చట్టబద్ధత కల్పించటం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవలను వ్యవస్థ‌ పరిధిలోకి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సచివాలయ వ్యవస్థ‌ ద్వారానే ప్రతిపక్షాలపైకి జగన్ మాస్టర్ స్ట్రోక్ కొట్టబోతున్నారు. ఈ విషయం అర్థ‌మవ్వటంతో టీడీపీ గోలగోల చేసేస్తోంది.

జగన్ మాస్టర్ స్ట్రోక్
X

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ లాంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించటం. పరిపాలనలో ఒక్కో ముఖ్యమంత్రి తన ముద్ర ఉండాలని కోరుకుంటారు. తన పరిపాలన ద్వారా జనాలకు దగ్గరవ్వాలని ఆశిస్తారు. ఎన్టీఆర్‌ మండల వ్యవస్థ‌ను తెచ్చారు. చంద్రబాబు నాయుడు హైటెక్ పాలనన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే జగన్ గ్రామ, వార్డు సచివాలయాలని అందుబాటులోకి తెచ్చారు.

అయితే ఈ వ్యవస్థ‌ తరచూ వివాదాస్పదమవుతోంది. నిజానికి సచివాలయాల్లో అందుతున్న సేవల ద్వారా జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. అవసరార్ధం వివిధ కార్యాలయాలకు వెళ్ళకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పనులు తొందరగా అవుతున్నాయని అనుకుంటున్నారు. ఇలాంటి వ్యవస్థ‌ను ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వివాదాస్పదం చేస్తోంది. దాఖలైన కేసుల కారణంగా కోర్టు కూడా విచారణ సందర్భంలో సచివాలయాల చట్టబద్ధతను ప్రశ్నించింది.

వీటన్నింటికీ జవాబుగా అన్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఇప్పటికే సచివాలయాల ద్వారా కొన్ని వందల సేవలు ప్రజలకు అందుతున్నాయి. అయితే ఇందులో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. వీళ్ళందరినీ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధ‌తిలో తీసుకుంది. సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లుగా సుమారు 4 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇంతటి భారీ వ్యవస్థ‌కు చట్టబద్ధత కల్పించాలని జగన్ అనుకోవటం శుభపరిణామం అని చెప్పాలి.

ప్రజాద‌రణను పొందిన సచివాలయ వ్యవస్థ‌కు చట్టబద్ధత కల్పించటం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవలను వ్యవస్థ‌ పరిధిలోకి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అక్కడక్కడ లోపాలున్నప్పటికీ మొత్తంమీద జనాలైతే హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. ప్రభుత్వ శాఖల్లో పనులు తొందరగా అవటమే కాకుండా అవినీతి కూడా తగ్గుతోందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో సచివాలయ వ్యవస్థ‌ ద్వారానే ప్రతిపక్షాలపైకి జగన్ మాస్టర్ స్ట్రోక్ కొట్టబోతున్నారు. ఈ విషయం అర్థ‌మవ్వటంతో టీడీపీ గోలగోల చేసేస్తోంది. మరి జగన్ స్ట్రోక్ ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.

First Published:  15 March 2023 5:49 AM GMT
Next Story