Telugu Global
Andhra Pradesh

జనాలకే చాయిస్ వదిలేశారా?

రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓట్లేయాలనే విషయాన్నిప్రజల చాయిస్‌కే జగన్ వదిలేశారు. దానికన్నా ముందు తనకు, ప్రతిపక్షాలు లేదా దుష్టచతుష్టయానికి ఉన్న‌ తేడాలను వివరించారు.

జనాలకే చాయిస్ వదిలేశారా?
X

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రైతు దినోత్సవంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రతిపక్షాలపైన తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓట్లేయాలనే విషయాన్నిప్రజల చాయిస్‌కే జగన్ వదిలేశారు. దానికన్నా ముందు తనకు, ప్రతిపక్షాలు లేదా దుష్టచతుష్టయానికి ఉన్న‌ తేడాలను వివరించారు.

జగన్ చెప్పిన తేడాలు ఏమిటంటే పాడిపంటలుండే పాలన కావాలా? లేకపోతే నక్కలు, తోడేళ్ళ పాలన కావాలా తేల్చుకోమన్నారు. రైతు రాజ్యం కావాలా? లేకపోతే రైతులను మోసం చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అని అడిగారు. రైతుకు తోడుగా ఉండే రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)లు ఉండాలా? లేకపోతే దళారీ వ్యవస్థ‌ను కోరుకుంటున్నారా? అని అడిగారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వం కావాలా? లేకపోతే ప్రజలను మోసం చేసే పెత్తందార్ల ప్రభుత్వం కావాలా తేల్చుకోమని జనాలకే చాయిస్ ఇచ్చారు.

అలాగే 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు, ఎగ్గొట్టిన విధానం, ప్రజలకు చేసిన మోసాల గురించి వివరించారు. అలాగే తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తుచేశారు. 2019 ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను అమలు చేయటానికి తాను ఎంత కష్టపడుతున్నది చెప్పారు. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నా, హామీలను పూర్తిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం తనదే అన్నారు.

ఏ సీజన్లో పంటకు నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సున్నా వడ్డీకే రైతులకు అందిస్తున్న రుణాల గురించి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్ళ కోసం తమ ప్రభుత్వం నాలుగేళ్ళల్లో రూ.58,767 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. ఇన్ని వివరాలు చెప్పి, చంద్రబాబు పాలనకు, తన పాలనకు తేడాను వివరించి ఎవరి పాలన కావాలో తేల్చుకోవాలని జనలకే చాయిస్ వదిలేశారు.

First Published:  9 July 2023 5:29 AM GMT
Next Story